Summer : మార్చి నెల ప్రారంభమై పది రోజులు కూడా కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతానికి భిన్నంగా చాలా ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. పచ్చదనానికి పేరొందిన కేరళలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. మార్చి రెండో వారంలోనే వేసవి తాపం ఎక్కువైంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 54 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటన వెలువడింది. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు, వడ దెబ్బ అవకాశాలను సూచిస్తుంది. వేసవిలో ఎండ 45 డిగ్రీలు దాటితనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. అలాంటి మార్చిలోనే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కేరళనే కాకుండా దేశం మొత్తానికి ప్రమాద సంకేతాలుగా చెప్పొచ్చు.
Read Also: Student Harassment: అనంతపురంలో విద్యార్థినిపై.. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు
గురువారం తిరువనంతపురం జిల్లాలోని అలప్పుజా, కొట్టాయం, కన్నూర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 54 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తోంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్లోని ప్రధాన ప్రాంతాలలో కూడా గురువారం 45 నుంచి 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు మించవు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్న ఐఎండీ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని ఆదేశించింది.