NTV Telugu Site icon

Vizag Steel Plant: వైజాగ్‌ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ.. కేసీఆర్ సంచలన నిర్ణయం!

Vizag Steel

Vizag Steel

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల కోసం విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ నుంచి అధికారుల బృందం ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్లనుంది. తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు తద్వారా ఉక్కును సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) కోసం వెంటనే విశాఖ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే వైజాగ్ వెళ్లనున్న బృందం.. యాజమాన్యం సేకరించదలచుకున్న నిధులు, తిరిగిచ్చే ఉత్పత్తులు, లేదంటే నిధులను వెనక్కి చెల్లించే విధివిధానాలు, ఇతర నిబంధనలు, షరతులను అధ్యయనం చేస్తుంది.

Read Also: Heat Wave Alert: ఈ నాలుగు రోజులు మండే ఎండలు.. ఐఎండీ వార్నింగ్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడమే కాకుండా కేంద్ర సర్కారుపై ఒత్తిడి తీసుకురావడం, అదే సమయంలో తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల బహిరంగంగానే విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవల మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడం కోసం ఆర్ఐఎన్ఎల్ ద్వారా కేంద్రం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనను తీసుకొచ్చిందని అన్నారు. బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు చేస్తున్న కుట్రలో ఇది తొలి అడుగని ధ్వజమెత్తారు. మరోవైపు, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలిశారు. ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న అవసరమైన పరిష్కార మార్గాలను వారు సూచించారు. విశాఖ ఉక్కుపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవడం కోసమే బిడ్డింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది అన్నారు బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో ఏపీ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు వెనుకబడ్డాయన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం ద్వారా రాజకీయంగా ఎదిగే ప్రక్రియను బీఆర్‌ఎస్‌ చేస్తుందనే వాదనను ఆయన ఖండించారు. వాటిని ఆయన కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ నిన్న ఈ విషయమై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఈవోఐలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లు కనుక తెలంగాణ సర్కారు సొంతమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై తమ పార్టీ వ్యతిరేకతను బలంగా చాటచ్చొన్నది కేసీఆర్ అభిప్రాయం.

Read Also: Telangana: పెండింగ్‌ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. బొగ్గు, నేల బొగ్గు, ఇనుము వంటి ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు నిబంధనల మేరకు పరస్పర అంగీకారంతో ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని యాజమాన్యం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్‌లో పేర్కొంది