హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనదారుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్స్టాప్ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నూతన ట్రాఫిక్ విధానం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్స్టాప్ల స్థానాలను మార్చే అంశంపై ఆర్టీసీ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని, త్వరితగతిన రీ-షెడ్యూల్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ ఉన్నట్లు గుర్తించామని.. అక్కడ ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీహిల్స్ ఫ్లైఓవర్, అండర్పాస్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ఉదయం 6 గంటల నుంచే వన్-వే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు కేబీఆర్ పార్క్ సర్కిల్ ఎంట్రెన్స్ వద్ద తప్పనిసరిగా ఎడమవైపు (క్యాన్సర్ ఆసుపత్రి మార్గం) మళ్లాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా పంజాగుట్ట వెళ్లే వాహనాలకు మాత్రమే స్ట్రెయిట్ మార్గంలో అనుమతి ఉంది.
రోడ్ నం. 45 నుంచి వచ్చే వాహనాలు చెక్పోస్టు వైపు మాత్రమే వెళ్లాల్సి ఉండగా, రోడ్ నం. 12 నుంచి వచ్చే వాహనాలకు అగ్రసేన్ సర్కిల్ వద్ద కుడివైపునకు తిరిగే (రైట్ టర్న్) అవకాశం లేదు. ఈ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రాంతమంతటా సీసీ కెమెరాలు, డ్రోన్లతో ట్రాఫిక్ను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సమర్థవంతమైన నిర్వహణ కోసం దాదాపు 1000 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చే ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ మళ్లింపుల సమగ్ర సమాచారం కోసం పౌరులు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ పోర్టల్ ను సందర్శించవచ్చు.

