NTV Telugu Site icon

Karnataka Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య.. ఎక్సైజ్‌ సుంకం భారీగా పెంపు

Karnataka

Karnataka

Karnataka Budget 2023: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం 2023-2024 ప్రభుత్వ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, మొత్తం 18 శ్లాబ్‌లపై ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 175 శాతం నుంచి 185 శాతానికి పెంచనున్నారు. కర్ణాటక బడ్జెట్ మొత్తం రూ. 3,27,747 కోట్లుగా అంచనా వేస్తూ ప్రకటించారు.

ఐదు హామీల పథకాలతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన 5 హామీలకు రూ.52 వేల కోట్లు కేటాయింపు ఉంటుందని, కోటి కంటే ఎక్కువ కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని, ఇది దేశంలోనే మొదటిసారిగా అమలు చేయబడుతుందని సిద్దరామయ్య ప్రసంగించారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని సిద్ధరామయ్య పేర్కొ్న్నారు. “మా ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మోరల్ పోలీసింగ్ పేరుతో ప్రజలను వేధించే వారిపై, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేసి సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.

Also Read: Karnataka High Court: ప్రధానిపై దుర్భాషలాడడం అవమానకరం, కానీ దేశద్రోహం కాదు

మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 2,50,933 కోట్లు, మూలధన వ్యయం రూ. 54,374 కోట్లు, రుణాల చెల్లింపు రూ. 22,441 కోట్లు కేటాయించారు. విద్యకు రూ.37,587 కోట్లు, స్త్రీ, శిశు అభివృద్ధికి రూ. 24,166 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపులో వరుసగా 11%, 7 శాతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 14,950 కోట్లు కేటాయించారు. గత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలను ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య విమర్శించారు. సీఎంగా సిద్ధరామయ్యకు ఇది ఏడవ బడ్జెట్. ఈ బడ్జెట్ సిద్ధరామయ్య హాజరయ్యే 14వ బడ్జెట్ కూడా అవుతుంది. 13 బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన మాజీ సీఎం దివంగత రామకృష్ణ హెగ్డే మార్కును ఆయన అధిగమించారు.