Extra Peg Row: ‘ఎక్స్‌ట్రా పెగ్’ తీసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సూచన.. కాంగ్రెస్ ఫైర్

Karnataka

Karnataka

Extra Peg Row: కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి ‘ఒక పెగ్’ తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు. హెబ్బాల్కర్‌ను హేళన చేస్తూ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పెరుగుదల హెబ్బాల్కర్‌ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని, రాత్రి బాగా నిద్రపోవడానికి నిద్ర మాత్ర లేదా అదనపు పెగ్ తీసుకోవాలని సూచించారు.

Read Also: MLC Kavitha: నేటితో ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు ప్రత్యేక కోర్టు ముందుకు

“నేను కర్ణాటకలోని ఎనిమిది ప్రాంతాలకు ఇన్‌చార్జిగా పనిచేశాను. బెలగావిలో పెద్ద సంఖ్యలో మహిళలు బీజేపీకి మద్దతుగా వస్తున్నారు. అందుకే మా అక్క (లక్ష్మీ హెబ్బాల్కర్) నిద్రపోయేందుకు నిద్రమాత్రలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. లేదా మంచిగా నిద్రపోవడానికి అదనపు పెగ్ కూడా తీసుకుంటే రమేష్ జార్కిహోళి అక్కడ ప్రచారం చేయడం కూడా కష్టమవుతుంది” అని శనివారం బెలగావిలో జరిగిన సభలో పాటిల్ అన్నారు. లక్ష్మీ హెబ్బాల్కర్‌పై చేసిన వ్యాఖ్యల ద్వారా సంజయ్ పాటిల్ మొత్తం మహిళా సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానించారని కర్ణాటక కాంగ్రెస్ బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ మహిళా వ్యతిరేక వైఖరి పెరుగుతోందని కూడా ఆ పార్టీ పేర్కొంది.

Read Also: Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్ ఎవరు..? పాకిస్తాన్ చేతికి ఎలా చిక్కాడు..? ఈ విషాదగాథ వివరాలు..

“మహిళలను ఎవరు చిన్నచూపు చూస్తున్నారు అంటే వారి పతనం మొదలైందని.. బీజేపీ, జేడీఎస్ పార్టీల పతనం మొదలైందని.. అందుకే వారి మహిళా వ్యతిరేక ధోరణి పెరుగుతోందని.. కౌరవులు, రావణుడిలాగా బీజేపీ, జేడీఎస్‌లు సర్వనాశనం కావడం ఖాయమని కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ముఖ్యంగా, హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌పై బెలగావి స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.