Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!

Bus Fire Accident

Bus Fire Accident

కరీంనగర్ జిల్లాలో నేడు ఉదయం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే బస్సులో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం ప్రధాన ద్వారంతో పాటు ఎమర్జెన్సీ గేట్లను తెరిచి ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు పంపించాడు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

×
×
Ad

ప్రయాణికులను సురక్షితంగా దించిన తర్వాత డ్రైవర్, సిబ్బంది బస్సులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటలు ఎక్కువ కావడంతో వాటిని నియంత్రించడం సాధ్యపడలేదు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కూడా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నారని స్థానికులు ఆరోపించారు.