భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనే నిర్ణయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ, కోహ్లీ ఈ విషయంలో కాస్త తొందరపడ్డాడని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడి ఉండాల్సిందని, అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. మైదానంలో కోహ్లీ ప్రదర్శించే దూకుడును టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రోతో ఆయన పోల్చారు.
గత ఏడాది (మే నెలలో) కోహ్లీ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యాడు. టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 770 పరుగుల దూరంలో ఉన్న సమయంలో, 37 ఏళ్ల వయసులో కూడా అత్యుత్తమ ఫామ్లో ఉంటూ విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడంపై తీవ్ర చర్చ నడిచింది.
ఈ విషయంపై కపిల్ దేవ్ మాట్లాడుతూ… ఇది కేవలం 10 వేల పరుగుల గురించిన విషయం కాదని, కోహ్లీ కోపంలో లేదా ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోకుండా, మరో ఆరు నెలలు ఓపిక పట్టి ఉంటే బాగుండేదని అన్నారు. భారత్ తరఫున ఆడటం ఆపేసాక మళ్లీ అవకాశం రాదని, ఆ తర్వాత కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే మిగులుతుందని గుర్తుచేశారు.
సెలక్టర్లు లేదా కెప్టెన్ మిమ్మల్ని ఎంపిక చేయనప్పటికీ, ఆవేశపడకుండా మరికొంత సమయం ఇవ్వాలని కపిల్ దేవ్ సూచించారు. గతంలో మోహిందర్ అమర్నాథ్, అంశుమన్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు జట్టులో చోటు కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్కు వెళ్లి పరుగులు సాధించి మళ్లీ పునరాగమనం చేశారని ఉదాహరణగా చెప్పారు. ఐపీఎల్ లేదా ఇతర టోర్నమెంట్లలో కోహ్లీ ఆడుతున్న తీరును చూస్తే, అతనికి ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం పూర్తిగా ఉందని, కానీ సమయం కంటే ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం తనకు కొంత నిరాశ కలిగించిందని కపిల్ దేవ్ వివరించారు.

