Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..

Kapil Dev

Kapil Dev

Kapil Dev: భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడబోతోందంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే మ్యాచ్ రోహిత్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ఊహాగానాలపై కపిల్ దేవ్ స్పందించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించినా.. ఆ క్షణాన్ని బాధతో కాకుండా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. వార్తా సంస్థ ‘ANI’తో మాట్లాడుతూ.. “మనం ఎందుకు బాధపడాలి? ఎప్పుడూ సంతోషంగా ఉందాం. ఇన్నేళ్లుగా రోహిత్ శర్మ మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు. క్రికెట్‌లో ఎవరైనా సరే ఒకరోజు వెళ్లాల్సిందే. గతంలో సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలందరూ రిటైర్ అయ్యారు. కాబట్టి రోహిత్ శర్మ కూడా ఒకరోజు వీడ్కోలు పలకక తప్పదు” అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.

రోహిత్ శర్మ కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని అందించాడని, అందుకే అతని కెరీర్ ముగింపును గౌరవిస్తూ వేడుక చేసుకోవాలని కపిల్ దేవ్ అన్నారు. అంతేకాదు, రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలుపుతూ.. “అతను ఒకవేళ వీడ్కోలు పలుకుతుంటే.. తన చివరి మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించి, సగర్వంగా తప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మ.. 2007 జూన్ 23న ఐర్లాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఏడాది ఆడిన 8 వన్డేల్లో కేవలం 30.12 సగటుతో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 79 పరుగులు కాగా, ప్రస్తుత సిరీస్‌లోని మొదటి రెండు వన్డేల్లో 11, 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే లార్డ్స్ వన్డే అతని చివరి మ్యాచ్ కానుందనే చర్చ జోరందుకోగా.. కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.