Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి

Kanpur Training Plane

Kanpur Training Plane

Uttar Pradesh: కన్పూర్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. గంగా నది బ్యారేజీ పరిసరాల్లోని ఓ పొలంలో ‘గార్గ్ ఏవియేషన్’ అనే కాన్పూర్ ఆధారిత శిక్షణ సంస్థకు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన పైలట్లతో పాటు కో-పైలట్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు వారు మరణించినట్లు ప్రకటించారు. మృతులలో పైలట్‌కు 3,000 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఆయన గుజరాత్‌కు చెందినవారు కాగా, కో-పైలట్ కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి వివరాలను ఇంకా పూర్తిగా సేకరించాల్సి ఉంది.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి సమాచారం అందించారు. డీజీసీఏ ప్రత్యేక బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించి విచారణ జరపనుంది. పూర్తిస్థాయి పరిశోధన తర్వాతే ప్రమాదం వెనుక ఉన్న సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. కాన్పూర్ విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన గాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.