YSRCP: వైసీపీలోకి కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు

Ysrcp

Ysrcp

YSRCP: ఓ వైపు జోరుగా ఎన్నికల ప్రచారం.. మరో వైపు చేరికలతో ఉత్సాహంగా సాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నాలుగో రోజు కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. బస్సు యాత్ర సందర్భంగా పలువురు కళ్యాణదుర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాణ దుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు.. అలాగే కంబదూరు, శెట్టూరుకు చెందిన టీడీపీ నేతలు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఆ పార్టీ నుంచి టికెట్‌ ఆశించారు. టికెట్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురై వైసీపీలో చేరారు. గతంలో ఆయన మంత్రి ఉషశ్రీ చరణ్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పోటీకి సిద్ధం కాగా.. టికెట్‌ దక్కకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ బస్సు యాత్రలో భాగంగా టీడీపీ, జనసేన అసంతృప్త నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పి.గన్నవరంలో జనసేన మాజీ నేత పితాని బాలకృష్ణ కూడా ఈ బస్సు యాత్రలో భాగంగా వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

Read Also: CM YS Jagan: లబ్ధి చేకూరింది.. తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్‌ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. కర్నూలు జిల్లాలో సాగిన యాత్రలో జనం అడుగడుజనా సీఎం జగన్‌కు నీరాజనం పట్టారు. ఎమ్మిగనూరు సభకు వైసీపీ శ్రేణులు భారీగా పోటెత్తారు. పెంచికలపాడు నుంచి రాతన వరకు భారీ స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ పూలవర్షం కురిపిస్తూ జనం సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు.