సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందించడానికి చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు వెనకాడుతుంటారు. కానీ తాజాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల చాలా ధైర్యంగా, ఎమోషనల్గా స్పందించారు నటి కాజల్. అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read : Shivaji-Chinmayi : హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి!
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని అతి దారుణంగా చంపి, చెట్టుకు కట్టి తగలబెట్టిన వీడియోలు నెట్టింట కలకలం రేపాయి. ఈ ఘోరకలిని చూసి తట్టుకోలేకపోయిన కాజల్.. “హిందువులారా మేల్కోండి.. మీ మౌనం మిమ్మల్ని రక్షించదు” అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీళ్ల ఎమోజీలను జోడిస్తూ ‘ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్’ అనే హ్యాష్ట్యాగ్తో అక్కడ జరుగుతున్న అరాచకాన్ని ప్రపంచానికి చూపించారు.
సాధారణంగా ఇలాంటి సున్నితమైన విషయాల్లో సెలబ్రిటీలు మౌనంగా ఉంటారు. కానీ కాజల్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణభయంతో ఉన్న తోటి మనుషుల కోసం గొంతు ఎత్తడం పై ప్రశంసలు కురుస్తున్నాయి. “మీరు నిజమైన చందమామ.. తోటి వారి బాధను అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉంది” అంటూ అభిమానులు ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తున్న కాజల్, సినిమాలతో పాటు సామాజిక అంశాల్లోనూ ఇంత యాక్టివ్గా ఉండటం విశేషం.