వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఅర్ఎస్, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయంగా కడియం కావ్య ఎదురుకోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కడియం కావ్యను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కడియం శ్రీహరి అన్నారు. మూడు నెలల్లో అద్భుతం జరగబోతుందని కేసీఆర్ అంటున్నారని, రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఏ ఒక్కచోట బీఆర్ఎస్ గెలవదని ఆయన అన్నారు. కొన్నిచోట్ల మూడో స్థానం.. మరికొన్ని చోట్ల డిపాజిట్లు రాకుండా పార్టీ కనుమరుగు అవుతుందని ఆయన తెలిపారు.
ఇదే జరిగే అద్భుతం అని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కేసీఆర్కు వరంగల్ అంటే కోపమని, ఈ గడ్డ మీద పోరాటాలు చేసినోళ్లు, ప్రశ్నించేటోళ్లు ఎక్కువ ఉంటారని, అందుకే ఆయనకు కోపమని చెప్పారు. కాకతీయులు ఇచ్చిన వారసత్వాన్ని కేసీఆర్ ముక్కలు చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓరుగల్లు అని గొప్పగా చెప్పుకున్న జిల్లాను ఎవరడిగారని ఆరు ముక్కలు చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్కు తెరవెనుక సపోర్ట్ చేయడానికే వరంగల్ పార్లమెంట్కు సంబంధం లేని వ్యక్తిని పోటీలో పెట్టారని ఆరోపించారు.