NTV Telugu Site icon

JP Nadda : ప్రజా వ్యతిరేక ప్రభుత్వం… ఈ కేసీఆర్ ప్రభుత్వం

Jp Nadda

Jp Nadda

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 2 దఫాలుగా పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్‌ ఇటీవల యాదాద్రి నుంచి మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. నేడు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మూడో దశ పాదయాత్ర ముగించనున్నారు. అయితే.. మూడో దశ ప్రజసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 3వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” ముగింపు సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చిందన్నారు. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే… కేసీఆర్ అంధకారంలోకి నెట్టేసిన తెలంగాణలో వెలుగులు నింపాలనే అని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం… ఈ కేసీఆర్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. రానున్న రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని, అప్పట్లో నిజాం జన సభలు పెట్టుకోవద్దని ఫర్మాణా జారీ చేశాడు… అదే ఆయనకు చివరిది అయిందని, ఇప్పుడు కేసీఆర్ కూడా సభలు పెట్టుకోవద్దని ఫర్మాణాలు జారీ చేస్తున్నాడంటూ విమర్శించారు.

 

కేసీఆర్ కు కూడా ఇదే చివరి ఫార్మాణా అవుతుందని, తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం నిధులు మంజూరు చేసినా… కేసీఆర్ వాటిని ఖర్చు చేయలేదని, కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధులతో… తన బొమ్మ పెట్టుకుని, తన స్కీమ్స్ గా ప్రచారం చేసుకుంటున్నాడని, తెలంగాణ ను ఏర్పాటు చేయాలని కాకినాడ లో మొదట తీర్మానం చేసిందే బీజేపీ అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని, రూ.40 వేల కోట్ల ప్రాజెక్టును 1.40 లక్షల కోట్లకు పెంచుకుని, డబ్బు దండుకున్నాడని, మజ్లిస్ కు భయపడే.. కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ను అధికారికంగా జరుపుతామన్నారు. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడని, దుబ్బాక, హుజురాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించామని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు చుక్కలు చూపిస్తామన్నారు జేపీ నడ్డా.