Job Scam: హైదరాబాద్ నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ ప్రాంతంలో “సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ” పేరుతో నడుస్తున్న సంస్థ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన ఘటన సంచలనంగా మారింది. ఈ మోసంలో సుమారు 90 మంది యువకులు బలైపోయారు.
ఈ కన్సల్టెన్సీ నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్లు ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించారు. విదేశాల్లో ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూసిన యువకుల్లో కొంతమందిని ఈజిప్ట్ వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, కన్సల్టెన్సీ నిర్వాహకులు ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి సొంత ఖర్చులతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు బాధితులు వాపోయారు.
ఇక హఫీజ్పేట్లో ఉన్న కన్సల్టెన్సీ కార్యాలయం అకస్మాత్తుగా మూతపడటంతో మోసపోయిన నిరుద్యోగులు షాక్కు గురయ్యారు. కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితులకు తాళాలు వేసి ఉండటం కనిపించడంతో మోసం జరిగిన విషయం బయటపడింది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు, అధికారిక ధృవీకరణలు ఉన్న సంస్థల ద్వారానే విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు.
