Jay Shah: 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్కు ముందు నిర్వహించిన ‘కెప్టెన్స్ కార్నివల్’ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంగ్లాండ్లో ఆదివారం (జూన్ 7)న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జయ్ షా.. పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు టోర్నీలో పాల్గొనే 12 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు.
కార్యక్రమం సందర్భంగా జై షా అన్ని జట్ల కెప్టెన్లను కలిసి అభినందించారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో ఆయన హ్యాండ్షేక్ చేయడం కెమెరాల్లో చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై భారత, పాకిస్థాన్ అభిమానులు భిన్నంగా స్పందించారు. కొందరు పాకిస్థాన్ అభిమానులు గతంలో భారత క్రికెట్ జట్టు అనుసరించిన ‘నో హ్యాండ్షేక్’ విధానాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మరోవైపు భారత అభిమానులు మాత్రం.. జై షా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉన్నందున అన్ని జట్లను సమానంగా గౌరవించడం ఆయన బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
గతంలో భారత్, పాకిస్థాన్ సంబంధాల నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య హ్యాండ్షేక్ అంశం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో అధికారిక కార్యక్రమాల్లో దూరంగా ఉండటం వార్తల్లో నిలిచింది. ఆ నేపథ్యంలో జై షా చేసిన ఈ కరచాలనం మరోసారి చర్చకు కారణమైంది. ఇదిలా ఉంటే.. 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ జూన్ 12న ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్తో ప్రారంభం కానుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికర పోరు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరగనుంది. కాగా, గత ఎడిషన్ విజేతలైన న్యూజిలాండ్ మహిళల జట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.

