Tahir Anwar Death: పాకిస్థాన్లో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాహీర్ అన్వర్ మరణాన్ని ఆ సంస్థ అధికారిక ఛానెల్ ద్వారా ధృవీకరించింది. సోమవారం అర్థరాత్రి బహావల్పూర్లోని ‘జామియా మసీదు ఉస్మాన్ వలీ’లో అతని అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. తాహిర్ అన్వర్ జైష్-ఎ-మొహమ్మద్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఏళ్లుగా ఆ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. తాహిర్ అన్వర్ మరణానికి గల కారణంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అనారోగ్యం లేదా మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. భారతదేశంలో జరిగిన అనేక భారీ ఉగ్రవాద దాడుల వెనుక జైషే మహమ్మద్ హస్తం ఉంది. 2001 పార్లమెంటు దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్ దాడి, 19 మంది సైనికులను బలిగొన్న ఉరి దాడి, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన 2019 పుల్వామా దాడుల్లో ఈ సంస్థ పాత్ర ఉంది. ఇక గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో, భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. బహావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం ‘జామియా మసీదు సుభాన్ అల్లా’పై భారత్ జరిపిన దాడుల్లో ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది.