తన నియోజకవర్గంలో క్యాన్సర్తో బాధపడే నిరుపేదలకు ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో క్యాన్సర్ పేషెంట్లు బతకడం లేదని, ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో తాను ఎంతో మందికి సహాయం చేశానని, రాష్ట్రంలోని దాతలు కూడా సహాయం అందించాలనే ఉద్దేశంతోనే ఇలా మీడియా ముందుకు వచ్చానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర వాడకు చెందిన రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ రాగా.. ఈరోజు ఆమెను జగ్గారెడ్డి పరామర్శించారు. ట్రీట్మెంట్ కోసం నాలుగు లక్షలు రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘రాణికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం నాలుగు లక్షలు అందించాను. స్పెసిఫిక్గా మీడియా ముందుకు రావడానికి ఓ కారణం ఉంది. క్యాన్సర్ ఎవ్వరికీ రావొద్దు. క్యాన్సర్ బాధితులది టెన్షన్లతో కూడిన జీవితం. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో బతకడం లేదు. పేషెంట్ ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు’ అని అన్నారు.
Also Read: BJP MP Laxman: రాహుల్, రేవంత్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు!
‘నా నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్థోమత లేని పేద క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నా. మొన్న సదాశివపేటలో క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల రూపాయలు, ఈరోజు సంగారెడ్డి పట్టణానికి చెందిన క్యాన్సర్ పేషెంట్కు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం అందించాను. నా వద్దకు ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్ కోసం సహాయం కావాలని ఎంతో మంది వస్తారు. వారికి నా ద్వారా సహాయం అందుతుంది. కానీ.. ఎన్నడూ మీడియాలో రాదు, అది నాకిష్టం ఉండదు. ఇలా మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో ఎంతో మంది దాతలు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీడియా ముఖంగా అందించడం జరిగింది’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.