తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతోంది. అయితే.. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ నిర్వహిస్తోన్న క్వశ్చన్ అవర్లో నేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డిపై జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడా భూకబ్జాలు చేయలేదు. తనపై ఉన్న కేసులు ధర్నాలు, రాస్తారోకో చేసిన కేసులు. పాస్పోర్ట్ కేసులో సీఎం కేసీఆర్. మంత్రి హరీష్రావు కూడా ఉన్నారు. సీఐడీ రిపోర్ట్ కూడా అందరికి చూపిస్తా. వాళ్ల ప్రభుత్వం ఉంది కాబట్టే హరీష్రావు మీద కేసులు లేవు. ఆనాడు సమైక్యంగా ఉండాలని చెప్పా. నేను వాళ్లను అడ్డుకున్నా, కొట్టా, రివర్స్ రిగ్గింగ్ చేసి గెలిచా. రాహుల్గాంధీ డైరెక్షన్లో నేను, రేవంత్ ముందుకెళ్తాం. కాంగ్రెస్ 70 సీట్లు రాబోతున్నాయి.
సీఎం పదవిపై ఆశ ఉండడం తప్పేమి కాదు. ఇప్పుడు రేవంత్ను ప్రేమిస్తున్నా, ఉత్తమ్, భట్టిని ప్రేమిస్తున్నా. ఇబ్బంది ఉంటే నాతో చెప్పు, మీడియాతో మాట్లాడకు అని రాహుల్ చెప్పారు. నన్ను రాహుల్ గుర్తించారు.. అది చాలు. దామోదర రాజనర్సింహతో అత్త కోడళ్ల పంచాయితీనే. తెలంగాణ కోసం కేసీఆర్ ఆనాడు ఢిల్లీకి వెళ్లి సోనియాను కలవలేదా..? మేము ఢిల్లీకి వెళ్లి మా పార్టీ హైకమాండ్ను కలిస్తే తప్పేంటి.? బీజేపీ, బీఆర్ఎస్లో సీఎం పదవి అడిగితే రాజకీయ జీవితం ఉండదు. బీజేపీకి రెండో స్థానం వచ్చే అవకాశం కూడా లేదు. నా జీవితమంతా అప్పుల రాజకీయమే. పేదోడి కోసం అప్పులు చేస్తా, పంచడానికి అప్పులు చేస్తా. నా మీద ఉన్న నమ్మకంతోనే మా క్యాడర్ మిత్తిలేకుండా అప్పు ఇస్తారు. గెలవమని తెలిసే బీజేపీ బీఆర్ఎస్ను బలపరుస్తోంది. ముస్లింలు కూడా ఈసారి ఎంఐఎంను నమ్మరు. రేవంత్రెడ్డితో నాకు గొడవలు లేవు. భవిష్యత్లో ఉండబోవు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదు. ‘ అని ఆయన అన్నారు.