Gudivada Amarnath: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర రాజకీయాలు, మహిళల భద్రత, హోంశాఖ పనితీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడలేదని స్పష్టం చేసిన ఆయన.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాపోయారు. “మేకప్” అనే పదాన్ని ఉపయోగించినంత మాత్రాన మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను, పార్టీ నేతలను విమర్శించడానికి అవకాశం ఉంటే, తమకు కూడా రాజకీయ ప్రత్యర్థులపై స్పందించే హక్కు ఉందని అన్నారు.
సాయి కృష్ణ తల్లి ఎదుర్కొంటున్న బాధను చూసి మహిళా లోకం మొత్తం బాధపడుతోందని అమర్నాథ్ అన్నారు. అలాగే, ఒక ఎమ్మెల్యే మహిళను మోసం చేసి గర్భస్రావానికి కారణమయ్యారనే ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆ అంశంపై హోంమంత్రి స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇదివరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎంతమంది మహిళలను తిరిగి గుర్తించి వారి కుటుంబాలకు చేర్చారో చెప్పాలని ప్రశ్నించారు.
హోంశాఖ పనితీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ సైతం హోంమంత్రి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక మహిళపై నడిరోడ్డుపై దాడి జరిగినా సమర్థవంతమైన చర్యలు తీసుకోలేకపోతే హోంమంత్రి పదవిలో ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. మహిళల గౌరవం గురించి తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన.. రాజకీయ విమర్శలకు తాము కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. “ఈసారి అరే తురే అంటూ మాట్లాడితే మళ్లీ అదే స్థాయిలో స్పందన ఉంటుంది” అని వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలుపుతూ.. జగన్ పాదయాత్ర ప్రారంభమైతే అది అధికార కూటమికి “పాడే యాత్ర”గా మారుతుందని ఎద్దేవా చేశారు. ఇకపై హోంశాఖ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, శాఖలో జరుగుతున్న అవినీతి అంశాలను బయటపెడతానని అమర్నాథ్ తెలిపారు. తాను ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రాజకీయ ప్రత్యర్థుల చర్యల వల్ల స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.

