కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులుగా ప్రజలను ద్రోహం, మోసం చేస్తోందని, ఆ పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా నదిలో మన నీటి హక్కులను కాపాడుకోవాల్సి ఉందన్నారు. కొండా సురేఖ, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని, అసలు రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ తమకు టచ్లో లేరని, సుస్మిత వ్యాఖ్యల వెనుక ఉన్న ఒక అవినీతి అనకొండ ఉందని వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన రైడ్పై ఈడీ ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు దీవెనలు ఉన్నాయని, పొంగులేటికి అసలు రాజకీయ ఓనమాలు తెలియవని జగదీష్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేసింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తుచేశారు. శాసనసభ ఎథిక్స్ కమిటీకి నిజాయితీ ఉండాలని, అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఆ కమిటీ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇతర పార్టీల నాయకుల చేరికలపై మాట్లాడుతూ.. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి రానివ్వబోమని, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని స్పష్టం చేశారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నా పార్టీలోకి తీసుకోమని, గతంలో ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు రావాలనుకున్నా బీఆర్ఎస్ తీసుకోలేదని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆయన డబ్బులకు అమ్ముడుపోయినట్టేనని పేర్కొన్నారు.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో వారి క్యారెక్టర్ ఆధారంగా ఒకరిద్దరిని తప్ప ఎవరినీ తిరిగి చేర్చుకోమని, ప్రస్తుతం పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ-లిమిటేషన్ కచ్చితంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని, డీ-లిమిటేషన్ జరిగితే ఆ ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

