తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని మరోసారి తేలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కొట్లాడేది కెసిఅర్ అని నిరూపితం అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులు దారాదత్తం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ పట్ల సోయి లేదని, కేఆర్ఎంబీ విషయాల్లో కాంగ్రెస్ ఎదురు దాడి చేసి… తప్పించుకునే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రకు కాంగ్రెస్ , బీజేపీ తెర తీసిందని ఆయన మండిపడ్డారు. ముందు బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనుల వేలంకు అంగీకారంకు వచ్చాయని, అది తెలిసి సింగరేణి బొగ్గు గనుల వేలం ను బీఆర్ఎస్ అడ్డుకుంటాం అని చెప్పామన్నారు.
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇప్పుడు బొగ్గు గనుల వేలం విషయంలో వెనక్కి తగ్గారని, కాంగ్రెస్ , బీజేపీలను బొగ్గు గనుల కోసం ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారని, నిన్న భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలకు…ఇవాళ మాటలకు తేడా ఉందని ఆయన అన్నారు. కిషన్ రెడ్డి కి బొకే ఇచ్చారు భట్టి విక్రమార్క.. ఇదేనా భట్టి మీ పోరాటం అని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణిని నట్టేట ముంచి దానికి ఉరి పెట్టే పని చేశాడంటూ కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరి వేయడమేనని జగదీశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.