ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) నుంచి మరో ఆసక్తికరమైన ఒరిజినల్ మూవీ ‘జబ్ ఖులి కితాబ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు సౌరభ్ శుక్లా దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే, ఒక పరిణతి చెందిన ప్రేమకథతో పాటు కుటుంబ భావోద్వేగాలను ఎంతో సున్నితంగా చూపించినట్లు అర్థమవుతోంది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధం తర్వాత, గోపాల్ (పంకజ్ కపూర్), అనసూయ (డింపుల్ కపాడియా) విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఈ కథలోని అసలు ట్విస్ట్. చావుబతుకుల మధ్య ఉన్న భార్యను ప్రాణంగా చూసుకునే భర్త, అసలు విడాకులు ఎందుకు అడుగుతున్నాడు? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ ట్రైలర్ సాగింది.
Also Read : Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం!
ఈ సినిమా గురించి పంకజ్ కపూర్ స్పందిస్తూ.. ‘ప్రేమ అనేది వయసుతో మసకబారదని, కాలానికి అనుగుణంగా అది మారుతూ ఉంటుందని ఈ సినిమా చెబుతుంది. సౌరభ్ శుక్లా రాసిన ఈ వాస్తవిక కథలో భాగమవ్వడం గొప్ప అనుభూతి’ అని అన్నారు. అలాగే డింపుల్ కపాడియా మాట్లాడుతూ, అనసూయ పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందని, తన వైవాహిక బంధం విషయంలో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించే ఒక ధైర్యవంతురాలైన మహిళగా ఈ పాత్ర కనిపిస్తుందని తెలిపారు. అపరశక్తి ఖురానా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం హాస్యం, భావోద్వేగాల కలయికగా ఉండబోతోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 6, 2026 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.