NTV Telugu Site icon

Chandrayaan-4: చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు.. ఇస్రో కీలక ప్రాజెక్టు

Isro

Isro

Chandrayaan-4: చంద్రయాన్‌-3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రుడి నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ అంచనాలను మించి సక్సెస్ అయింది. ఈ సక్సెస్‌తో భారత్ పై ప్రపంచ దేశాల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై మరిన్ని పరిశోధనల కోసం ఇస్రో రెడీ అవుతోంది. చంద్రయాన్‌-4 పేరుతో మరో కీలక ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి పైనుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకోసం లునార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ను సిద్ధం చేస్తోంది.

Read Also: Congress: ప్రపంచకప్ చూడటానికి టైం ఉంది కానీ.. ప్రధానికి మణిపూర్ వెళ్లేందుకు వీలు కాలేదా?

చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగింది. చంద్రయాన్‌-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగుతుంది. ఇందులో 350 కేజీల బరువున్న రోవర్‌ను పంపనున్నారు. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగుతుంది. చంద్రయాన్‌-3 మిషన్ జీవిత కాలం ఒక లునార్‌ డే కాగా, చంద్రయాన్‌-4..ఏడు లునార్‌ డేలు పనిచేస్తుంది. లూపెక్స్‌, చంద్రయాన్‌ 4 ప్రాజెక్టుల ద్వారా 350 కిలోల ల్యాండర్‌ను చంద్రుడి చీకటివైపు ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్‌ను దించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ వెల్లడించారు. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం రెండు లాంచ్‌ వెహికల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. చంద్రయాన్-4 ప్రయోగానికి నాలుగైదేళ్లు పట్టే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రయోగం.. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన మిగిలిన మూన్ మిషన్‌ల కంటే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చంద్రయాన్ 4 ప్రయోగంపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.