ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటీవ్ మాన్యుఫాక్చరింగ్(ఏఎం) సాంకేతికతను ఉపయోగించి పీఎస్4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. దీనిని 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. సాధారణంగా అనేక విడి భాగాలను ఒక చోట అమర్చి.. వెల్డింగ్ చేసి తయారు చేస్తారు. కానీ ఈ ఇంజిన్ను ఒకే భాగంగా తయారు చేశారు. ఈ టెక్నాలజీని వాడడం వల్ల 97 శాతం ముడి పదార్థాలు, ఉత్పత్తి సమయం 60 శాతం తగ్గుతుందని ఇస్రో తెలిపింది. మే 9న 665 సెకన్ల పాటు ఏఎమ్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన లిక్విడ్ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి ఇస్రో ఈ ప్రధాన మైలురాయిని సాధించిందని అంతరిక్ష సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇస్రో ప్రకటించింది.
Read Also: India-Maldives: భారత్కు తిరిగొచ్చిన మాల్దీవుల్లో నివసిస్తున్న సైనికులు
ఇంజిన్ తయారీ భారతీయ పరిశ్రమలో జరిగింది. ఇంజిన్ను తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ను పరీక్షించేందుదుకు నాలుగు విజయవంతమైన డెవలప్మెంటల్ హాట్ టెస్ట్లు 74 సెకన్ల సంచిత వ్యవధి కోసం నిర్వహించారు. ఇవి ఇంజిన్ పనితీరు పారామితులను ధృవీకరించాయి. ఇంకా, ఇంజిన్ 665 సెకన్ల పూర్తి అర్హత వ్యవధి కోసం విజయవంతంగా పరీక్షించబడింది. అన్ని పనితీరు పారామితులు ఊహించిన విధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. ఈ పీఎస్4 ఇంజిన్ను సాధారణ PSLV ప్రోగ్రామ్లో చేర్చాలని యోచిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.