ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ మధ్య మక్కా ఒప్పందం జరిగాక టర్కీ రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తోంది. దీంతో ఇజ్రాయెల్.. టర్కీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తాజాగా గ్రీస్తో ఇజ్రాయెల్ చేసుకున్న ఒప్పందమే ఉదాహరణ.
టర్కీ-గ్రీస్ దేశాలు నాటో సభ్య దేశాలే అయినప్పటికీ.. రెండు దేశాల మధ్య వైరం నడుస్తోంది. టర్కీ ఈ మధ్య తన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు బిలియన్ల యూరోలను ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల పాకిస్థాన్తో కూడా కీలక ఒప్పందం చేసుకుంది. ఇదంతా ఇజ్రాయెల్పై దాడి వ్యూహంలో భాగంగానే జరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం గ్రీస్-ఇజ్రాయెల్తో కీలక ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్తో సుమారు 3 బిలియన్ యూరోల ($3.5 బిలియన్) విలువైన బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం సైనిక ఆధునీకరణ కార్యక్రమంలో ఒక భాగంగా తెలుస్తోంది. స్వల్ప, మధ్య, దీర్ఘ శ్రేణి అధునాతన క్షిపణి వ్యవస్థలను కలిగి ఉన్న ఈ ఒప్పందానికి ఆ దేశ భద్రతా మండలి ప్రాథమిక ఆమోదం తెలిపింది. గ్రీకు అధికారులు సోమవారం టెల్ అవీవ్లో ఇజ్రాయెల్ సిబాట్, మాఫాట్ డైరెక్టరేట్లతో మూడు రకాల క్షిపణులు, రాడార్ వ్యవస్థల కోసం సుమారు 3 బిలియన్ యూరోల విలువైన నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారని ఒక అధికారి రాయిటర్స్కు తెలిపారు.
టర్కీని దృష్టిలో పెట్టుకునే గ్రీస్ అంతటి స్థాయిలో భారీ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పైగా టర్కీ ఇజ్రాయెల్కు కూడా శత్రువుగా ఉండడంతో గ్రీస్లో భారీగా ఆయుధాలు నిల్వ ఉంచాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
గ్రీస్-టర్కీ శత్రుత్వం
గ్రీస్ ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ ద్వీపకల్పంలో ఉంది. ఇది మధ్యధరా సముద్రంతో చుట్టుముట్టబడి ఉంది. యూరోపియన్ యూనియన్లో సభ్య దేశం. దీని రాజధాని ఏథెన్స్. దీనికి ఉత్తరాన అల్బేనియా, ఉత్తర మాసిడోనియా, బల్గేరియా, తూర్పున టర్కీ సరిహద్దులుగా ఉన్నాయి. గ్రీస్కు దాని పొరుగు దేశమైన టర్కీతోనే అత్యంత దీర్ఘకాలిక వైరం ఉంది. ఏజియన్ సముద్రంలోని ద్వీపాలు, సముద్ర సరిహద్దులు, గగనతలం, సైప్రస్ ద్వీపం విషయంలో ఈ రెండు దేశాల మధ్య చారిత్రక వివాదాలు ఉన్నాయి. 1974లో సైప్రస్లో టర్కీ సైనిక జోక్యం తర్వాత సంబంధాలు మరింత క్షీణించాయి. రెండూ నాటో సభ్య దేశాలే అయినప్పటికీ.. నేటికీ అప్పుడప్పుడు సైనిక ఉద్రిక్తతలు, దౌత్యపరమైన ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రీస్ ఇప్పుడు టర్కీని కేంద్రంగా చేసుకొని తన రక్షణ వ్యూహాన్ని బలపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్తో ఈ ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గ్రీస్ 2036 నాటికి ‘అకిల్స్ షీల్డ్’ అనే బహుళ-పొరల యాంటీ-బాలిస్టిక్, యాంటీ-ఎయిర్క్రాఫ్ట్, యాంటీ-డ్రోన్ వ్యవస్థను నిర్మించాలని.. అలాగే అమెరికా నుంచి 40 ఎఫ్-35 ఫైటర్ జెట్లను, ఫ్రాన్స్, ఇటలీల నుంచి ఫ్రిగేట్లను కొనుగోలు చేయడానికి సుమారు 28 బిలియన్ యూరోలు ఖర్చు చేయాలని యోచిస్తోంది. డ్రోన్ నిరోధక వ్యవస్థ కోసం ప్రత్యేక ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. గ్రీస్ తన గగనతలాన్ని రక్షించుకోవడానికి అమెరికా తయారు చేసిన పేట్రియాట్ వ్యవస్థను, రష్యా యొక్క ఎస్-300 వ్యవస్థను, అనేక రకాల స్వల్ప-శ్రేణి వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తుంది. పొరుగు దేశమైన టర్కీతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం కారణంగా గ్రీస్ తన జీడీపీలో సుమారు 3.5 శాతాన్ని రక్షణ కోసం ఖర్చు చేస్తోంది. ఇది అనేక నాటో మిత్రదేశాల కంటే ఎక్కువ.
బలమైన ఆర్థిక, దౌత్య సంబంధాలు కలిగిన గ్రీస్. ఇజ్రాయెల్ దేశాలు గ్రీస్లో ఒక వాయు శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాయి. ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి. డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీపై సహకరించుకుంటాయి. గత సంవత్సరం ఏథెన్స్ సుమారు €650 మిలియన్ల వ్యయంతో ఇజ్రాయెల్లో తయారైన 36 రాకెట్ ఫిరంగి వ్యవస్థలను కొనుగోలు చేసింది.

