దశాబ్దాలుగా ప్రపంచం ఇజ్రాయెల్ అణ్వాయుధాల గురించి ఒక వింతైన మౌనాన్ని పాటిస్తోంది. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ ఆ దేశం మాత్రం దీన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు, అలాగని లేవని ఖండించలేదు. కానీ.. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. ఈ అణ్వాయుధాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి..?
అంతర్జాతీయ రక్షణ సంస్థల అంచనా ప్రకారం.. ఇజ్రాయెల్ వద్ద సుమారు 80 అణు వార్హెడ్లు ఉన్నాయి. వీటిని విమానాల ద్వారా లేదా క్షిపణుల ద్వారా ప్రయోగించే సత్తా ఆ దేశానికి ఉంది. అయితే.. మిగిలిన అగ్రరాజ్యాల లాగా ఇజ్రాయెల్ ఎప్పుడూ తన అణ్వాయుధ శక్తిని ప్రదర్శించలేదు. ఈ రహస్యమే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే, ఏ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వీటిని వాడుతుందో ఎవరికీ తెలియదు.
తాజాగా ఇరాన్ దేశం ఇజ్రాయెల్లోని ‘డిమోనా’ నగరంపై దాడి చేసింది. ఇక్కడే ఇజ్రాయెల్ అణు కేంద్రం ఉంది. తన అణు కేంద్రాలపై దాడులు జరిగితే తాము కూడా ఇజ్రాయెల్ అణు కేంద్రాలను వదలబోమని ఇరాన్ ఈ దాడి ద్వారా హెచ్చరించింది. 1967, 1973 యుద్ధాల సమయంలోనూ ఇజ్రాయెల్ తన ఉనికికే ప్రమాదం ఏర్పడిందని భావించినప్పుడు అణ్వాయుధాలను వాడాలని ఆలోచించిందని కొన్ని కథనాలు ఉన్నాయి.
‘శాంసన్ ఆప్షన్’ అంటే ఏమిటి..?
ఇజ్రాయెల్ రక్షణ వ్యూహాలలో ‘శాంసన్ ఆప్షన్’ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే, ఒకవేళ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయి.. దేశం పూర్తిగా అంతమైపోయే పరిస్థితి వస్తే.. శత్రువులను కూడా వదలకుండా వారితో పాటే తాము కూడా అంతమైపోయేలా అణ్వాయుధాలను ప్రయోగించడం. సాధారణంగా అణ్వాయుధాలు కేవలం ఎదుటి దేశాన్ని భయపెట్టడానికి ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ ఆలోచన మాత్రం ‘మేము లేకపోతే ప్రపంచమే వద్దు’ అనే రేంజ్లో ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గాజా యుద్ధం..
2023 అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు చూస్తుంటే.. ఆ దేశం ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడదని అర్థమవుతోంది. కొన్ని అంచనాల ప్రకారం.. గాజాపై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల శక్తి హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే కొన్ని రెట్లు ఎక్కువ. కేవలం సాధారణ ఆయుధాలతోనే ఇంతటి విధ్వంసం సృష్టించిన దేశం, ఒకవేళ యుద్ధంలో తాము ఓడిపోతున్నామని భావిస్తే అణ్వాయుధాలను వాడదని గ్యారెంటీ ఏముంది..? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
అంతర్జాతీయ నిబంధనలకు అతీతంగా..
ప్రపంచంలోని చాలా దేశాలు అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కానీ ఇజ్రాయెల్ ఏ ఒప్పందానికీ కట్టుబడి లేదు. ఆ దేశ అణు కేంద్రాలను తనిఖీ చేసే అధికారం ఏ అంతర్జాతీయ సంస్థకూ లేదు. దీనివల్ల ఇజ్రాయెల్ అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి ఎలాంటి జవాబుదారీతనం లేదు.
ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంది. ఇరాన్, లెబనాన్, గాజా ఇలా అన్ని వైపుల నుంచి యుద్ధం చుట్టుముడుతున్న వేళ, ఇజ్రాయెల్ గనుక తన ఉనికి ప్రమాదంలో ఉందని భావిస్తే.. అది అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇది కేవలం పశ్చిమాసియాకే కాదు, మొత్తం ప్రపంచానికే ముప్పు. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడైనా జోక్యం చేసుకుని ఈ అణు ముప్పును అరికట్టాల్సిన అవసరం ఉంది.