Ishan Kishan: భారత్ టీ20 వరల్డ్ కప్లో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ను చిత్తు చేసి కప్పు కొట్టేసింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే.. ఇషాన్ కిషన్ గురించి ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఎంతో దుఃఖాన్ని తన మదిలో ఉంచుకుని నిన్న ఫైనల్ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ అనంతరం ఇషాన్ మాట్లాడుతూ.. తన కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వెల్లడించాడు. ఫైనల్కు ముందు అంటే శుక్రవారం రోజు తన సిస్టర్ యాక్సిడెంట్లో మరణించింది. తన కోసమే ఈ మ్యాచ్ శ్రద్ధతో ఆడాడని.. తన విజయాన్ని ఆమెకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. హార్దిక్ పాండ్యతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు చెప్పాడు. హార్దిక్ ప్రోత్సాహంతో జట్టుకు ప్రాధాన్యమిచ్చానన్నాడు. అంతర్జాతీయ ఉమెన్స్ డే రోజు వచ్చిన ఈ విజయాన్ని చనిపోయిన సోదరికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు.
READ MORE: Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!
ఇదిలా ఉండగా.. ఇషాన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. గతంలో ఇషాన్పై క్రమశిక్షణ పేరుతో మేనేజ్మెంట్ వేటు వేసింది. రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విశ్రాంతి కావాలని కిషన్ కోరాడు. ఆ నిర్ణయం జట్టు నిర్వహణకు అంతగా నచ్చలేదు. ముఖ్యంగా సెలక్షన్ కమిటీ మెంబర్ అజిత్ అగార్కర్, కోచ్ ద్రావిడ్కు అది అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంత కాలం పాటు కిషన్ను టీమిండియాకు దూరం పెట్టారు. అయినా.. ఇషాన్ నిరాశ చెందలేదు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. తిరిగి తన ప్రతిభను గుర్తు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ పోటీలోనూ వరుసగా పరుగుల వర్షం కురిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ పోటీలో జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తూ విజేతగా నిలిపాడు. అదే అతని జీవితంలో పెద్ద మలుపు అయింది. ఆ ప్రదర్శనలతో అతను మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్పై జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో అతనికి అవకాశం వచ్చింది. అక్కడి అద్భుతంగా ఆడుతూ చివరి మ్యాచ్లో శతకం సాధించాడు. ఆ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని బలపరిచాడు. ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్లో కిషన్ అద్భుతంగా ఆడాడు. మొత్తం పోటీలో 317 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. పుట్టెడు దుఃఖంలోనూ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆడటం అభినందనీయం.