జైపుర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్కు ఓ మెయిల్ వచ్చింది. స్టేడియం అధికారులు వెంటనే జైపుర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం జైపుర్ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. మీకు వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. దీంతో భద్రతా దళాలు స్టేడియం చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. మెయిల్పై అధికారులు విచారణ చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ 2025 కొనసాగుతోంది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మ్యాచ్లు ఆడుతోంది. మే 16న పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ను జైపుర్లో ఆడనుంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈ మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఉండనుంది. జైపూర్కు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా జైపూర్కు ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. ఏప్రిల్ 3న జైపూర్ జిల్లా కలెక్టరేట్ను పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. ఫిబ్రవరి 20న ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీని పిలుస్తామని బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 4న జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. వరుస బెదిరింపులు నగర భద్రత గురించి ఆందోళనలను రేకెత్తించాయి.
Also Read: Rohit Sharma: అంతా చెత్త.. భారత్ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చింది. ఆపరేషన్ సిందూర్లో దాదాపు 100 మందిని మట్టుబెట్టినట్లు కేంద్రం అధికారికంగా తెలిపింది. ఆపరేషన్ సిందూర్తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ సమయంలో పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడుతోంది.