NTV Telugu Site icon

R Ashwin-MS Dhoni: ఎంఎస్ ధోనీకి జీవితాంతం రుణపడి ఉంటా: ఆర్ అశ్విన్‌

Ashwin

Ashwin

R Ashwin Heap Praise on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎందరో కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్.. చాలా మందిని భారత జట్టులోకి తీసుకొచ్చాడు. ఈ జాబితాలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ కూడా ఉన్నాడు. 2008లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన అశ్విన్‌కు భారత జట్టులో ధోనీ అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం దిగ్గజ స్పిన్నర్లతో ఒకడిగా ఉన్నాడు. ధోనీ వల్లే తాను ఇలా ఉన్నానని తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విన్‌ తెలిపాడు. ధోనీకి జీవితాంతం రుణపడి ఉంటానని యాష్ పేర్కొన్నాడు.

రవిచంద్రన్ అశ్విన్‌ ఇటీవల టెస్టుల్లో 500 వికెట్ల మార్క్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో అశ్విన్‌కు సన్మానం జరిగింది. టెస్టుల్లో అరుదైన‌ మైలురాయికి గుర్తుగా 500 బంగారు నాణాలతో టీఎన్‌సీఏ అశ్విన్‌ని స‌త్క‌రించింది. అంతేకాదు రూ.1 కోటి క్యాష్‌ను కూడా బ‌హుమ‌తిగా అందించింది. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని కీలక విషయాలను యాష్ గుర్తుచేసుకున్నాడు.

Also Read: Hanuman OTT: అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘2008లోనే నేను చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొప్ప క్రికెటర్లను కలిశా. ఆ సీజన్‌ మొత్తం నేను బెంచ్‌కే పరిమితమయ్యా. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. ముత్తయ్య మురళీధరన్‌ ఉండటంతో నాకు అవకాశం రాలేదు. తర్వాత సీజన్‌లో అరంగేట్రం చేశా. అవకాశం ఇచ్చిన ఎంఎస్ ధోనీకి జీవితాంతం రుణపడి ఉంటా. క్రిస్‌ గేల్‌ వంటి డేంజర్ బ్యాటర్‌కు తొలి ఓవర్‌ వేసే అవకాశం ఇచ్చాడు. 17 ఏళ్ల తర్వాత అనిల్‌ భాయ్‌ నా కెరీర్‌ గురించి మాట్లాడుతుంటే.. చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా దేని గురించైనా మాట్లాడేటప్పుడు పదాల గురించి నేను పెద్దగా వెతుక్కోను. కానీ అనిల్ భాయ్ చేసిన వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఎప్పటికీ గర్వంగా ఫీలవుతా’ అని అశ్విన్ పేర్కొన్నాడు.