నిర్మల్ పర్యాటకాభివృద్ధిలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అ్లలోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయగాలకు నెలవు అని, దీంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సందర్శకుల రాకపోకలు ఎక్కువయ్యాయని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాలు, ఆధ్మాత్మిక కేంద్రాలు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. నిర్మల్ కొత్త జిల్లాగా ఆవిర్భవించాక మౌలిక వసతులు పెరిగాయని, అలాగే దక్షిణ భారతదేశలోనే ఏకైక బాసర సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటం, కవ్వాల్ అభయారణ్యం, కడెం ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చెర జలపాతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు నిర్మల్ పట్టణం కేంద్రబిందువుగా మారిందన్నారు.
Also Read : Today (27-12-22) Stock Market Roundup: వరుసగా రెండో రోజూ కొనసాగిన శాంతాక్లాజ్ ర్యాలీ
ఆహ్లాదం, ఆధ్యాత్మికంగా నిర్మల్ కొత్తరూపు సంతరించుకుందని, అయితే పర్యాటకుల తాకిడి పెరగడం, జిల్లా కేంద్రంగా విస్తరించిన విశ్రాంతి భవనాల కొరత తీవ్రంగా ఉందని, తగిన మౌలిక వసతులతో జిల్లా కేంద్రంలో ఆధునాతన హరిత హోటల్ నిర్మాణంతో పర్యాటకులు, భక్తులకు ఆ కొరత తీరనుందని చెప్పారు. రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హరిత హోటల్ నిర్మాణానికి ఆర్ & బీ శాఖ తమ స్థలాన్ని కేటాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధునిక వసతులతో హోటల్ నిర్మాణం పూర్తయితే దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎంతగానే ఉపయోగపడుతుందని వెల్లడించారు. త్వరలోనే టెండర్ లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.