Site icon NTV Telugu

Indra Karan Reddy : త్వర‌లోనే దేశానికి బీజేపీ పీడ విరగడవుతుంది

Indrakaran Reddy

Indrakaran Reddy

కేంద్రం తీరుకు నిరసనగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆద్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో రైతుల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వర‌లోనే దేశానికి బీజేపీ పీడ విరగడ అవుతుందని, సీఎం కేసీఆర్ సార‌ధ్యంలోని బీఆర్ఎస్ దేశంలో వివిధ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ రైతుల‌పై కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ధర్నాలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సంద‌ర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతుల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం మొండి వైఖ‌రి న‌శించాల‌ని నినాదాలు చేశారు. కల్లాల నిర్మాణాలకు ఉపాధి హామీ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యేలు, గులాబీ శ్రేణులు అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం సమర్పించారు.

ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం క‌క్ష్య‌పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉపాధి హామీ నిధులతో తెలంగాణ రైతుల కోసం కల్లాలు నిర్మించుకుంటే మోదీ ప్రభుత్వానికి కడుపు మంటగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి . చేపల ఆరబోతకు కల్లాల నిర్మాణం చేసుకుంటే ఉపాధి హామీ నిధులు ఇస్తూ…. మన తెలంగాణ రైతులు పంట ఆరబెట్టెందుకు నిర్మించుకున్న కల్లాలకు నిధులు ఇవ్వమనడం తెలంగాణ పట్ల కేంద్రం వివ‌క్ష‌కు ఇది నిదర్శనమని అన్నారు. క‌ల్లాల ఎందుకు నిర్మిస్తారో తెలియ‌ని ప‌రిస్థితిలో కేంద్ర బీజేపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రైతులు బాగుపడాల‌ని ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంటే.. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం వ్యవ‌సాయ రంగాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తూ… రైత‌న్న‌ల క‌డుపుకొడుతుంద‌ని మండిప‌డ్డారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.

నిర్మ‌ల్ జిల్లాలో రూ. 12 కోట్ల‌తో 19 వేల క‌ల్లాల‌ను నిర్మించుకున్నార‌ని, ఇప్పుడు వాటికి నిధులు ఇవ్వ‌మంటే రైతులు ఇప్పుడు ఎక్క‌డికి పోవాల‌ని ప్ర‌శ్నించారు. వ్యవసాయ కల్లాల నిర్మాణం పూర్తి అయ్యాక రైతులకు ఉపాధి హామీ నిధులు ఇవ్వమనడం సరికాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఇకనైనా రైతు వ్యతిరేఖ విధానాలకు స్వస్తి పలకాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హితవు పలికారు.

Exit mobile version