గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతున్న ‘రూ. 5 భోజనం’ (అన్నపూర్ణ పథకం) ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధనాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల సామాన్యులకు తక్కువ ధరలో ఆహారాన్ని అందించే సేవా కార్యక్రమాలకు పెను సవాలుగా మారింది. ఇటువంటి క్లిష్ట సమయంలో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నడుస్తున్న అన్నపూర్ణ కేంద్రాలు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నాయి. నగరంలోని ప్రధాన వంటశాలల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. ఇక్కడ అన్నం, పప్పు వంటి ప్రధాన పదార్థాలను వండటానికి సోలార్ ప్యానెల్స్ ద్వారా లభించే విద్యుత్తును ఉపయోగిస్తున్నారు. సూర్యరశ్మి ద్వారా లభించే శక్తిని వంటకు వాడటం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. గ్యాస్ వినియోగం కేవలం 10 శాతం నుంచి 20 శాతం వరకు మాత్రమే పరిమితం అవ్వడం వల్ల నిర్వహణ ఖర్చులు భారంగా మారడం లేదు.
Also Read:CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..
ప్రస్తుతం ఉన్న నిల్వలు సరిపోతాయని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. భవిష్యత్తులో గ్యాస్ కొరత ఏర్పడినా ఈ సోలార్ వ్యవస్థ ద్వారా భోజనాలు అందించే ప్రక్రియలో ఎలాంటి అవరోధం ఉండదని వారు చెబుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాలకే పరిమితం కాకుండా.. హాస్టళ్లు, హోటళ్లు, పెద్ద సంస్థలు కూడా ఈ తరహా సోలార్ పద్ధతులను అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇంధన పొదుపు అనేది కేవలం అవసరం మాత్రమే కాదు.. బాధ్యత కూడా. సోలార్ విద్యుత్తును వంటకు వాడటం అనేది గ్యాస్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం. ఇదే బాటలో అందరూ నడిస్తే గ్యాస్ వాడకాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడుకోవచ్చు. అక్షయపాత్ర వంటి సంస్థల సహకారంతో సాగుతున్న ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. గ్యాస్ ధరలు పెరిగినా పేదవాడి ఆకలి తీర్చే ఈ ‘రూ. 5 భోజనం’ నిరంతరాయంగా అందడం నగవాసులకు పెద్ద ఊరట.