Indigo Emergency: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ఇంజిన్ ఫెయిల్ అయినట్లు అనుమానం రావడంతో రన్వే 28 వద్ద ‘ఫుల్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు. సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ, పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. విమానాశ్రయ అధికారుల సమన్వయంతో ఉదయం 10:54 గంటలకు రన్వే 28పై విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రన్వే పొడవునా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.
ఊపిరి పీల్చుకున్న 161 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత వెంటనే ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాథమిక తనిఖీల అనంతరం వారిని గమ్యస్థానాలకు పంపించారు. ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక లోపానికి గల కారణాలపై ఇండిగో యాజమాన్యం సమగ్ర విచారణకు ఆదేశించింది. విమానాశ్రయ యంత్రాంగం, పైలట్ అప్రమత్తత వల్లనే ఒక భారీ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.
