ఎక్కడపడితే అక్కడ మృగాళ్లు రెక్కలు విప్పుకుని మరీ మీద పడుతున్నారు… రాత్రి సమయంలో ఉద్యోగరీత్యా ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటేనే గజగజా వణికిపోతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఓ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవరే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు సిటీలో హాట్టాపిక్గా మారింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఓ ఇండిగో ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ ఉద్యోగినిపై ఓ కామాంధుడు తెగబడ్డాడు. ఆమెను ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లే క్యాబ్ డ్రైవరే అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ప్రతిరోజూ ఉద్యోగులను డ్యూటీకి తీసుకెళ్లే క్యాబ్ డ్రైవర్పై ఆ ఉద్యోగినికి నమ్మకముంది. కానీ తనపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఇండిగో ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న బాధితురాలు జులై 20న మధ్యాహ్నం డ్యూటీ కోసం శంషాబాద్ విమానాశ్రయానికి క్యాబ్లో బయలుదేరింది. క్యాబ్ డ్రైవర్ ఎర్రపోగు ప్రశాంత్ కుమార్ మార్గమధ్యంలో వాహనాన్ని దారి మళ్లించాడు. విమానాశ్రయం సమీపంలోని నిర్మాణంలో ఉన్న సాంక్టా మారియా స్కూల్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ క్యాబ్ను ఆపిన నిందితుడు “టాయిలెట్కు వెళ్లి వస్తాను” అంటూ కిందకు దిగాడు. అనంతరం వెనుక సీటు వద్దకు వచ్చి బాధితురాలిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనతో తీవ్ర షాక్కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు అందుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక సమాచారంతో నిందితుడు ప్రశాంత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని రిమాండ్కు పంపింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి కేసు నమోదు చేశామని, నిందితుడిని వేగంగా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనతో శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల రవాణా కోసం ఏర్పాటు చేసే క్యాబ్ సేవల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

