BPCL LPG ATM: యుద్ధ మేఘాల వల్ల దేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
READ ALSO: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఏటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందడం డబ్బులు డ్రా చేసినంత సులభం అని అధికారులు చెబుతున్నారు. ముందుగా యూజర్ తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్కు వచ్చే ఓటిపి (OTP)ని ఎంటర్ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత వారి పాత సిలిండర్పై ఉన్న బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఇప్పుడు యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించాలి. తర్వాత పాత ఖాళీ సిలిండర్ను మిషన్ లోపల ఉంచగానే, కేవలం 2-3 నిమిషాల్లో నిండుగా ఉన్న కొత్త సిలిండర్ బయటకు వస్తుంది.
ఈ ఏటీఎం ద్వారా లభించే సిలిండర్లు మనం రెగ్యులర్గా వాడే ఇనుప సిలిండర్లు కావు. ఇవి ఫైబర్ ఆధారిత ‘కంపోజిట్ సిలిండర్లు’. సాధారణ సిలిండర్ బరువు (గ్యాస్తో కలిపి) 31 కిలోలు ఉంటే, ఈ కంపోజిట్ సిలిండర్ కేవలం 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఇవి చాలా తేలికగా ఉండటంతో ఎవరైనా సులభంగా మోసుకెళ్లవచ్చు, అలాగే ఇవి వాడకంలో కూడా అత్యంత సురక్షితమైనవిగా చెబుతున్నారు.
24/7 అందుబాటులో సేవలు
ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటు పనిచేస్తుంది. గ్యాస్ ఏజెన్సీలతో పని లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. మిషన్లో గ్యాస్ స్టాక్ తగ్గిపోగానే, ఆటోమేటిక్గా సమీప ఏజెన్సీలకు అలర్ట్ వెళ్లి స్టాక్ రీఫిల్ అవుతుంది. గ్యాస్ ఏజెన్సీలపై వినియోగదారుల ఆధారితాన్ని తగ్గించడం, యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో కూడా గ్యాస్ సరఫరాను సాఫీగా సాగించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ
