Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..

Indian Railways

Indian Railways

Indian Railways: రైల్వే ప్రయాణికుడికి సంబంధించిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రైలు గంటల కొద్దీ ఆలస్యంగా రావడంతో స్టేషన్‌లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చిన ఓ వ్యక్తికి, ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందని రైల్వే అధికారులు రూ.500 జరిమానా విధించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

జూన్ 11న తన బంధువులను రైలెక్కించేందుకు ఆ వ్యక్తి కళ్యాణ్ జంక్షన్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో రైలు రావాల్సి ఉండటంతో తీసుకోవాల్సిన ప్లాట్‌ఫామ్ టికెట్ కొనుగోలు చేసి స్టేషన్‌లోకి ప్రవేశించాడు. అయితే అనుకోని విధంగా రైలు చాలా ఆలస్యంగా స్టేషన్ కు చేరుకుంది. నిజానికి సదరు రైలు మధ్యాహ్నం సమయానికి రావాల్సి ఉండగా.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు చేరుకుంది. రైలు ఏకంగా 5 గంటల పాటు ఆలస్యంగా రావడంతో ఆ వ్యక్తి కూడా స్టేషన్‌ లోనే వేచి ఉండాల్సి వచ్చింది.

×
×
Ad

సదరు వ్యక్తి బంధువులను రైలెక్కించిన తర్వాత స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా.. రైల్వే సిబ్బంది టికెట్ల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్ గడువు ముగిసిందని అధికారులు గుర్తించారు. రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ చెల్లుబాటు కాకపోవడంతో రూ.500 జరిమానా + రూ.20 ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధర కలుపుకొని రూ.520లు మొత్తం జరిమానాగా విధించారు.

రైలు ఆలస్యం అయిందన్న విషయం తెలిపినా కానీ.. అధికారులు వినకపోగా జరిమానా విధించారు. ఈ ఘటనతో రైల్వే నిబంధనలపై మరోసారి చర్చ మొదలైంది. భారతీయ రైల్వే నియమాల ప్రకారం ప్లాట్‌ఫామ్ టికెట్లు నిర్దిష్ట సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అవి రైలు రాకపోకల సమయాలతో సంబంధం లేకుండా, స్టేషన్‌లో ప్రవేశించిన సమయాన్ని ఆధారంగా తీసుకుని అమల్లో ఉంటాయి. అయితే రైలు ఆలస్యం కావడం ప్రయాణికుడి నియంత్రణలో లేని విషయం కాబట్టి.. ఇలాంటి సందర్భాల్లో మినహాయింపులు ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైల్వే వ్యవస్థ కారణంగా ఏర్పడిన ఆలస్యానికి ప్రయాణికుడే జరిమానా చెల్లించాల్సి రావడం న్యాయమా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆ వ్యక్తికి మద్దతుగా నిలుస్తూ.. రైల్వే ఆలస్యాల కారణంగా ప్రయాణికులు నష్టపోవడం సరైంది కాదని అంటున్నారు. మరికొందరు మాత్రం రియల్‌ టైమ్ ట్రైన్ ట్రాకింగ్ యాప్‌ లను ఉపయోగించి స్టేషన్‌ కు వచ్చే సమయాన్ని సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.