India vs England: భారత టీ20 క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బెల్ఫాస్ట్లో ఐర్లాండ్ చేతిలో ఎదురైన 2-0 షాకింగ్ ఓటమితో చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో బుధవారం డర్హామ్లో ఇంగ్లాండ్తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్కు ముందు.. టీమిండియా మేనేజ్మెంట్ను ఒకే ఒక సెలెక్షన్ ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. అదే.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని నేరుగా తుది జట్టులోకి (ప్లేయింగ్ ఎలెవన్) తీసుకోవాలా వద్దా? దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన యువ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ చుట్టూ ఇంత చర్చ జరగడం సహజమే. అతడిని అంతర్జాతీయ వేదికపై చూడాలనే ఉత్సుకత అందరిలోనూ ఉంది. కానీ, అంతర్జాతీయ క్రికెట్లో ఎంపిక అనేది కేవలం ప్రతిభ, ఉత్సాహంపై మాత్రమే ఆధారపడి ఉండదు. దానికి సరైన సమయం, అలాగే ఇప్పటికే స్థిరపడిన ఒక కాంబినేషన్ను అనవసరంగా మార్చకుండా ఉండే సంయమనం కూడా అవసరం.
అభిషేక్ శర్మ రూపంలో బలమైన పక్షం
ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెనర్గా అభిషేక్ శర్మను కొనసాగించడమే సరైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో అతను డకౌట్ అయిన మాట నిజమే అయినప్పటికీ, దాన్ని ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోలేం. అతని గత కొన్ని ఇన్నింగ్స్లను గమనిస్తే.. 49, 52, 9, 10, 55 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అతను ఫామ్లో లేడనుకుంటే పొరపాటే. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారీ రిస్క్ తీసుకుంటూ జట్టుకు వేగవంతమైన, ప్రభావవంతమైన ఆరంభాన్ని ఇవ్వడమే అతని శైలి. ఇదే టార్గెట్గా ఈ ఏడాది 15 టీ20 మ్యాచ్ల్లో ఏకంగా 203.27 స్ట్రైక్ రేట్తో 372 పరుగులు సాధించాడు. ఆధునిక టీ20 క్రికెట్లో ఓ మేటి ఓపెనర్కు ఉండాల్సిన రికార్డు ఇది. టీ20ల్లో ఓపెనింగ్ అనేది అత్యంత కఠినమైన బాధ్యత. అలాంటి పొజిషన్లో ఓ ఆటగాడు నిలకడగా జట్టుకు అవసరమైన ఇంపాక్ట్ ఇస్తున్నప్పుడు, బలమైన కారణం లేకుండా అతడిని పక్కనబెట్టడం సమంజసం కాదు.
టీమ్ బ్యాలెన్స్ ముఖ్యం
ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్ విషయానికొస్తే.. ఇది వైభవ్ ప్రతిభకు సంబంధించినది కాదు, కేవలం జట్టు సమతుల్యతకు సంబంధించినది. ప్రస్తుతం భారత్కు ఓపెనింగ్ జోడీపై స్పష్టత ఉంది. ఒకవైపు అభిషేక్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా, సంజూ శామ్సన్తో అతని భాగస్వామ్యం మరో అవకాశం ఇచ్చేలా ఉంది. ఇప్పుడు కేవలం ఒక మ్యాచ్ వైఫల్యం ఆధారంగా 15 ఏళ్ల వైభవ్ను జట్టులోకి తెస్తే.. అది కేవలం ఒక మార్పుతో ఆగదు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మారాలి, పవర్ప్లే వ్యూహాలు మారాలి. దీంతో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న కాంబినేషన్ దెబ్బతింటుంది. దీనికి తోడు డర్హామ్ వేదికగా ఇంగ్లాండ్ పిచ్లపై ఆరంభంలో సీమ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లకు ఇది చాలా సవాలుతో కూడుకున్న వాతావరణం. అంతర్జాతీయ కెరీర్ను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న ఓ కుర్రాడికి డెబ్యూ ఇవ్వడానికి ఇవి అనుకూలమైన పరిస్థితులు కావు.
భారత్ ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం ఆటగాళ్లకు నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించడం, టాప్ ఆర్డర్లో స్థిరత్వాన్ని కొనసాగించడమే. విజయవంతమైన జట్లు మార్పులను ఆహ్వానిస్తాయి, కానీ కాంబినేషన్ బాగున్నప్పుడు అనవసర మార్పులు చేయవు. అభిషేక్ శర్మ కేవలం అప్పుడప్పుడు మెరుపులు మెరిపించే ఆటగాడు కాదు, పవర్ప్లేలో భారత్ ఆశించే విధ్వంసకర ఆరంభాలను అతను నిలకడగా ఇస్తున్నాడు. ఫామ్ కోల్పోకుండా లేదా ఎలాంటి వ్యూహాత్మక అవసరం లేకుండా అతడిని తొలగించడం కష్టం. ఇక, మరో ముఖ్యమైన కోణం ఏంటంటే.. ఒకే ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన, మరొక యువ ఆటగాడిపై ఉన్న క్రేజ్ కారణంగా ఫామ్లో ఉన్న సీనియర్ ప్లేయర్ను పక్కనబెడితే.. అది డ్రెస్సింగ్ రూమ్లో మిగిలిన ఆటగాళ్లలో అభద్రతాభావాన్ని నింపుతుంది. అయితే, దీని అర్థం వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు రావు అని కాదు. అతనికున్న అసాధారణ ప్రతిభకు సలాం కొట్టాల్సిందే. కానీ.. టీ20 క్రికెట్లో ఎంట్రీ కోసం కొంత ఎదురు చూడక తప్పదు.

