India vs England: టీ20ల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన వరుస పరాజయాల తర్వాత.. టీమిండియా ముందు అతిపెద్ద సవాల్ ఉంది. కేవలం వన్డే సిరీస్ గెలవడమే కాదు, పోగొట్టుకున్న పరువును తిరిగి దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్కు కేవలం 15 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత జట్టుకు ఒక ఫైనల్ మ్యాచ్ లాంటిదే. కేవలం రెండు వారాల క్రితం వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని జట్టుగా ఉన్న భారత్.. ఈ 14 రోజుల్లో పూర్తిగా డీలా పడింది. బ్యాటింగ్ వైఫల్యం, పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు జట్టు బలహీనతలను బయటపెట్టాయి. ఫార్మాట్ మారినా ప్రశ్నలు మాత్రం అవే మిగిలాయి.. భారత జట్టు విదేశీ గడ్డపై పుంజుకోగలదా? అనేది ప్రధాన ప్రశ్న. అయితే, భారత అభిమానులకు ఉన్న ఏకైక ఊరట ఏమిటంటే.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్లు తిరిగి రావడం. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మళ్లీ మూడో స్థానంలో బరిలోకి దిగుతుండగా, రోహిత్ శర్మ రాక డ్రెస్సింగ్ రూమ్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. మిడిలార్డర్లో కెఎల్ రాహుల్ బలాన్ని ఇవ్వనుండగా, కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఇది తనను తాను నిరూపించుకునే మంచి అవకాశం. అన్నింటికంటే ముఖ్యంగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాదాపు 968 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత (2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత) మళ్లీ వన్డే ఫార్మాట్లో బంతిని చేతపట్టనున్నాడు. కానీ, కేవలం పెద్ద ప్లేయర్లు ఉన్నంత మాత్రాన మ్యాచ్లు గెలవలేము కదా! ప్రస్తుతం టీమిండియా ముందు ప్రధానంగా నాలుగు ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయి.
మొదటిది, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత వన్డేల్లోకి వస్తుండటంతో, వారు వెంటనే తమ పాత లయను అందుకోగలరా అనేది పెద్ద ప్రశ్న. రెండోది, ఈ పర్యటనలో మహ్మద్ సిరాజ్ లేకపోవడంతో కొత్త బంతితో వికెట్లు తీసే బాధ్యత బుమ్రా, అర్ష్దీప్ సింగ్లపై పడింది. కానీ అర్ష్దీప్ ఇటీవలి కాలంలో అంతగా ప్రభావం చూపడం లేదు. మూడోది, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల ఆల్రౌండర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. జట్టులో అదనపు బ్యాటర్ను ఆడించాలా లేక బౌలర్ను తీసుకోవాలా అనే సందిగ్ధత మేనేజ్మెంట్ను వేధిస్తోంది. ఇక నాలుగోది, కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలడు అనేది చూడాలి. టీ20 సిరీస్ ఓటములతో అతని వ్యూహాలపై విమర్శలు వస్తున్న తరుణంలో, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై అతను తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం కానున్నాయి.
భారత జట్టుకు గడిచిన కొద్దికాలంగా వన్డేల్లోనూ ఆశించిన ప్రదర్శన లేదు. జూలై 2024 తర్వాత భారత్ ఆడిన ఆరు ద్వైపాక్షిక వన్డే సిరీస్లలో శ్రీలంక, ఆస్ట్రేలియా చేతుల్లో, సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతుల్లో పరాజయం పాలై మూడింటిని కోల్పోయింది. కాబట్టి, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగబోయే 2027 ప్రపంచకప్కు ముందు తప్పులను సరిదిద్దుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఈ ఎడ్జ్బాస్టన్ పిచ్ ఆరంభంలో పేసర్లకు స్వింగ్ లభిస్తుంది కాబట్టి, తొలి 10 ఓవర్లలో రోహిత్-గిల్ జోడీ ఆడే విధానం, బుమ్రా వేసే మొదటి స్పెల్ ఈ మ్యాచ్ దిశను నిర్దేశిస్తాయి. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటం, వర్షం పడే అవకాశం లేకపోవడం భారత్కు కలిసివచ్చే అంశం.

