Gautam Gambhir: మెల్బోర్న్లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. అయితే భారత జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.
READ ALSO: IND vs AUS: తేలిపోయిన భారత బౌలర్లు.. ఆస్ట్రేలియా ఘన విజయం..!
రెండంకెల స్కోరు ఇద్దరిదే..
మెల్బోర్న్ T20లో ఇద్దరు భారత బ్యాట్స్మెన్ మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు. ఎనిమిది మంది బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరును కూడా చేరుకోలేకపోయారు. ఒక బ్యాట్స్మన్ (వరుణ్ చక్రవర్తి) 0 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వాస్తవానికి టీమిండియా ఈ మాత్రం స్కోర్ చేయడానికి ముఖ్య కారణం ఓపెనర్ అభిషేక్ శర్మ. ఈ గౌరవ ప్రదమైన స్కోర్కు కారణం అయిన ఆయనకు భారత జట్టు కృతజ్ఞతలు చెప్పాలి. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అభిషేక్కు తన T20I కెరీర్లో ఇది ఆరో అర్ధ సెంచరీ. హర్షిత్ రాణా కూడా రెండంకెల స్కోరును చేరుకున్నాడు. 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు. తన ఇన్సింగ్స్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అక్షర్ పటేల్ (7 పరుగులు) భారత ఇన్నింగ్స్లో మూడవ టాప్ స్కోరర్.
మూడో స్థానంలో సంజు..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్లో కొన్ని ప్రయోగాలు చేసింది. కానీ అవి మంచి ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయినప్పుడు, సంజు సామ్సన్ను మూడో స్థానంలో పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగం అస్సలు పని చేయలేదు. సంజు సామ్సన్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సాధారణంగా T20 అంతర్జాతీయ మ్యాచ్లలో మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కాన్బెర్రా T20 మ్యాచ్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. కెప్టెన్ సూర్య మూడవ స్థానంలో వచ్చాడు. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో శివం దుబే స్థానం ఆశ్చర్యకరంగా ఉంది. అతను బ్యాటింగ్ ఆర్డర్లో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తర్వాత స్థానంలో ఉన్నాడు.
హర్షిత్ రాణా ఏడో స్థానంలోనూ, శివం దూబే ఎనిమిదో స్థానంలోనూ బరిలోకి దిగారు. హర్షిత్ 35 పరుగులు చేసి ఉండవచ్చు, కానీ దాని కోసం అతను చాలా బంతులు ఎదుర్కొన్నాడు. ఇదే క్రమంలో త్వరగా పరుగులు చేయాలనే ఒత్తిడిలో హర్షిత్ తన వికెట్ కోల్పోయాడు. హర్షిత్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన శివం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. 125 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో పూర్తి చేసింది. దీంతో గౌతమ్ గంభీర్ స్ట్రాటజీపై క్రికెట్ ప్రేమికుల నుంచి, భారత అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
READ ALSO: Akkineni Nagarjuna: నాగార్జున ఫస్ట్ సినిమా నిర్ణయం తీసుకున్నది ఆయనే..
