పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!

Telegram

Telegram

Telegram: సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కంటెంట్ పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌ (Telegram)కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) నోటీసు జారీ చేసింది. పైరసీ కంటెంట్‌ను వెంటనే తొలగించి, తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” (ATR) సమర్పించాలని ఆదేశించింది.

భారత క్రియేటర్ ఎకానమీ, సినీ పరిశ్రమ, టెలివిజన్ ప్రసార సంస్థలు, ఓటీటీ వేదికలు, నిర్మాతలు, పంపిణీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. పైరసీకి పాల్పడుతున్న ఛానళ్లు, గ్రూపులు, బాట్లు, ఖాతాలు, అడ్మినిస్ట్రేటర్లు, అనుబంధ సంస్థలపై కూడా టెలిగ్రామ్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ మధ్యకాలంలో పలు ఓటీటీ సంస్థలు, కంటెంట్ యజమానులు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తమ కాపీరైట్ కలిగిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు టెలిగ్రామ్‌లో అనుమతి లేకుండా విస్తృతంగా షేర్ అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్రం మొత్తం 3,142 టెలిగ్రామ్ ఛానళ్లు పైరసీ కంటెంట్‌ను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించింది. దీనితో సమాచార సాంకేతిక చట్టం-2000 (IT Act, 2000) కింద టెలిగ్రామ్‌కు నోటీసులు జారీ చేశారు. కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించడంతో పాటు.. మధ్యవర్తి సంస్థగా (Intermediary) తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్రం స్పష్టం చేసింది.

సమాచార సాంకేతిక (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021 ప్రకారం, ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు అక్రమ కంటెంట్‌ను తొలగించడం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు తప్పనిసరి. ఈ నిబంధనలను టెలిగ్రామ్ కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం తెలిపింది. అలాగే.. ప్రతి పైరసీ ఛానల్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి చెప్పే వరకు వేచి ఉండకూడదని కూడా కేంద్రం హెచ్చరించింది. టెలిగ్రామ్ స్వయంగా పర్యవేక్షణ చేపట్టి, పైరసీ కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.

గత కొంతకాలంగా టెలిగ్రామ్‌పై భారత్‌లో పలు వివాదాలు తలెత్తుతున్నాయి. మోసాలు, వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాల నిర్వహణ, సున్నితమైన సమాచార ప్రసారం వంటి అంశాలపై ఇప్పటికే కేంద్రం నిఘా పెంచింది. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్ సేవలపై గతంలో కేంద్రం తాత్కాలికంగా నిషేధం కూడా విధించింది. ఇప్పుడు పైరసీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా చర్యతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టంగా కనపడుతుంది.