Indians in Canada: కెనడాలోని భారతీయ పౌరులను, ఆ దేశానికి వెళ్లే విద్యార్థులను జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కెనడాలో ఇటీవల భారతీయుల పట్ల నేరాలు పెరిగాయని.. విద్వేష దాడి ఘటనలు కూడా ఎక్కువయ్యాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి కెనడాతో చర్చ చేపట్టామని, నేరాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. “కెనడాలో ఈ నేరాలకు పాల్పడినవారు ఇప్పటివరకు న్యాయస్థానం ముందుకు తీసుకురాబడలేదు” అని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కెనడా వెళ్లే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఒట్టావోలో ఉన్న ఇండియన్ మిషన్ లేదా టొరంటో, వాంకోవర్లో ఉన్న కౌన్సులేట్లలో భారతీయ విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం తన ప్రకటనలో కోరింది.
సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీ తీసిన సమయంలోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు. భారత్తో మంచి సంబంధాలున్న దేశం దీన్ని అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Digvijaya Singh: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో నేను లేను..
కెనడాలో 1.6 మిలియన్ల మంది భారతీయ మూలాలు కలిగిన వారు, ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. వారు కెనడా జనాభాలో 3శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇటీవలే భారతీయులే లక్ష్యంగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు చేసింది.