2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి (BCCI), టీమ్ మేనేజ్మెంట్ ప్లేయర్స్ ఎంపికకు సంబంధించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. 2011 తర్వాత భారత్ మళ్లీ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేకపోవడంతో, రాబోయే టోర్నీలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఘనమైన వీడ్కోలు అందించేందుకు జట్టును బలంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైన్-అప్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఈ టాప్-5 బ్యాటర్లలో అందరూ కుడిచేతి వాటం ఆటగాళ్లే కావడం జట్టుకు ప్రధాన బలహీనతగా మారింది. అంతేకాకుండా.. మిడిల్ ఆర్డర్లో ఎవరైనా గాయపడితే సరైన ప్రత్యామ్నాయ (బ్యాకప్) ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా యువ ఆటగాడు తిలక్ వర్మను జట్టులోకి తీసుకురావాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది.
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ వర్మ జట్టులోని రైట్-హ్యాండర్ల వరుసను విచ్ఛిన్నం చేయడమే కాకుండా, పార్ట్-టైమ్ ఆఫ్బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. టాప్ ఆర్డర్లో బౌలింగ్ చేయగల ఆటగాళ్లు లేకపోవడం వల్ల దిగువ వరుస బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ భావిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆల్రౌండర్ల ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా, మ్యాచ్లో కనీసం 4 ఓవర్లు వేయగల బ్యాకప్ ఆటగాడు అవసరమని గుర్తిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో ఉండే వేగం, బౌన్స్ పరిస్థితులకు తగినట్లుగా జట్టు సిద్ధం కావాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్, రోహిత్, విరాట్ వయసు రీత్యా వస్తున్న చిన్నపాటి సమస్యలు, కేఎల్ రాహుల్ వయసు పెరగడం వంటి అంశాలు జట్టు ఫిజికల్ ఫిట్నెస్పై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లను ఇప్పటినుంచే సిద్ధం చేయడం భారత జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

