IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?

  • గాలే టెస్టులో విజయానికి చేరువైన భారత్..
  • 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక..
  • 84/4తో నాలుగో రోజు ఆట ముగింపు..
  • శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగులు అవసరం..
  • చేతిలో 6 వికెట్లు..
Ind Vs Sl (1)

Ind Vs Sl (1)

IND vs SL: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంకకు ఇంకా 288 పరుగులు అవసరం కాగా, చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో చివరి రోజు భారత విజయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే వాతావరణం, వర్షం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 116.4 ఓవర్లలో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 167 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా, ధ్రువ్ జురేల్ 51, రిషభ్ పంత్ 39, యశస్వి జైస్వాల్ 32 పరుగులతో సహకరించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు, కేశర నువంత 3 వికెట్లు తీశారు. భారత్ భారీ స్కోరుకు సమాధానంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌటైంది. సోనల్ దినూష 100 పరుగులు చేయగా, నిరోషన్ డిక్వెల్లా 80 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మనవ్ సుతార్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకె ఆలౌట్ అయ్యింది. రిషభ్ పంత్ 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. కేఎల్ రాహుల్ 35, దేవదత్ పడిక్కల్ 44 పరుగులు చేశారు. మిగితా బ్యాటర్స్ రాణించలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4 వికెట్లు, ప్రభాత్ జయసూర్య 3 వికెట్లు తీశారు. భారత్ 193 పరుగులకు ఆలౌట్ కావడంతో శ్రీలంక ముందు 372 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. నిశాన్ మధుష్క ఫెర్నాండో 6, పసిండు సూరియబండార 0, కమిందు మెండిస్ 2 పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం లహిరు ఉదర కూడా 16 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో శ్రీలంక 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ ధనంజయ డి సిల్వా, సోనల్ దినూష కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ధనంజయ 31, సోనల్ దినూష 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ భారత్‌ను కొంతసేపు విజయానికి దూరంగా ఉంచారు.

భారత బౌలర్లలో మనవ్ సుతార్ మరోసారి 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం శ్రీలంక 84/4తో ఉండటంతో ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఐదో రోజు తొలి సెషన్‌లోనే భారత బౌలర్లు మిగిలిన వికెట్లను త్వరగా పడగొడితే టీమిండియా విజయం ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ధనంజయ, దినూష క్రీజులో నిలదొక్కుకుని భారీ భాగస్వామ్యం నెలకొల్పితే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అయితే గాలేలో చివరి రోజు వాతావరణ పరిస్థితులు అత్యంత కీలకం కానున్నాయి. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడితే భారత విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోనే కనిపిస్తున్నప్పటికీ, వర్షం మాత్రం టీమిండియా విజయానికి ప్రధాన అడ్డంకిగా మారే అవకాశముంది. చుడాలిమరి.. ఐదో రోజు భారత్ మిగిలిన ఆరు వికెట్లను ఎంత త్వరగా పడగొడుతుందో, వరుణుడు ఆటకు ఎంతవరకు సహకరిస్తాడో తేలితేనే ఈ తొలి టెస్టు ఫలితం స్పష్టమవుతుంది.