NTV Telugu Site icon

IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ప్రత్యేక కార్యక్రమం.. హాజరుకానున్న సూపర్ స్టార్, మాస్టర్ బ్లాస్టర్!

Narendra Modi Stadium

Narendra Modi Stadium

Amitabh Bachchan, Rajinikanth and Sachin will attend IND vs PAK Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. నేడు (అక్టోబర్ 11) ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుందని సమాచారం.

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం అన్న విషయం తెలిసిందే. 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకు ఉంది. నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటికే ప్రపంచకప్‌ 2023 మొదటి మ్యాచ్ జరిగింది. ఇక భారత్, పాకిస్థాన్‌ కోసం సిద్దమైంది. ఈ మెగా మ్యాచ్ కోసం స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇండో-పాక్ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిందట. అర్జిత్ సింగ్ వేదికపై ప్రదర్శన ఇస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మ్యాచ్‌కు హాజరవుతారట.

Also Read: Pro Kabaddi 2023: చరిత్ర సృష్టించిన పవన్‌.. తెలుగు జట్టు తరఫున బరిలోకి!

అక్టోబర్ 14న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రతను గుజరాత్ పోలీసులు ఏర్పాటు చేశారు. గుజరాత్ పోలీసులు, ఎన్‌ఎస్‌జి, ఆర్‌ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని అహ్మదాబాద్‌లో మోహరిస్తామని ఓ సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. గత 20 ఏళ్లలో అహ్మదాబాద్ నగరంలో క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా మతపరమైన హింసలు జరగనప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా భారీగా భద్రతా బలగాలను మోహరించనున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు.