IND vs ENG Playing XI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో భాగంగా మంగళవారం నాటింగ్హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్లో భారత్ 0-1తో వెనుకబడి ఉండటంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది.
సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసింది. ఆ తర్వాత మాంచెస్టర్లో జరిగిన రెండో టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు భారత్పై విజయం సాధించింది. దీంతో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టుపై ఒత్తిడి పెరిగింది. అంతకుముందు ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ భారత్ ఘోర ఓటములను చవిచూసింది. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత ఆటగాళ్లు తమ పూర్తి శక్తి సామర్థ్యలను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం మరింత బాధ్యత వహించాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్ల్లో భారత్ 189, 190 పరుగులు చేసినప్పటికీ అవి సరిపోయేలా కనపడడం లేదు. ఇంగ్లండ్ బౌలర్ల వైవిధ్యమైన బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు కాస్త ఇబ్బందులు పడినట్లు కనిపించింది.
మరోవైపు అభిమానుల దృష్టి ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశిపై ఉంటుంది. రెండో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినా, అతని దూకుడు బ్యాటింగ్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాటింగ్హామ్లో జరిగే ఈ మ్యాచ్లో అతడు భారీ ఇన్గ్స్ ఆడుతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక జట్టు కూర్పులో పెద్ద మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబేలు మధ్యవరుస బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే బౌలింగ్ విభాగంలో ఒక మార్పు జరిగే అవకాశముంది.
రెండో టీ20లో తీవ్రంగా నిరాశపరిచిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంపై సందేహాలు నెలకొన్నాయి. మాంచెస్టర్ మ్యాచ్లో అతడు నాలుగు ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకోలేకపోయాడు. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు పేసర్కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం ఆలోచనలో ఉంది. బిష్ణోయ్ స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు అవకాశం దక్కవచ్చని అంచనాలు ఉన్నాయి.
భారత్ ప్లేయింగ్ XI (అంచనా):
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశి, ఇషాన్ కిషన్ (W), శ్రేయస్ అయ్యర్ (C), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI (అంచనా):
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (W), హ్యారీ బ్రూక్ (C), జాకబ్ బెతెల్, టామ్ బెంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్.
భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి 10 గంటలకు నాటింగ్హామ్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను డీడీ స్పోర్ట్స్లో ఉచితంగా చూడవచ్చు. అలాగే సోనీలివ్, జియో హాట్స్టార్ ప్లాట్ఫారమ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

