IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా ఎట్టకేలకు మొదటి వన్డేతో విజయాల బాట పట్టింది. ఐర్లాండ్ చేతిలో 0-2తో టీ20 సిరీస్ను కోల్పోయిన భారత జట్టు, ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా 4-0తో వైట్వాష్కు గురైంది. అయితే సీనియర్స్ రాకతో వన్డే సిరీస్ను మాత్రం ఘనంగా ప్రారంభించింది. తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు కార్డిఫ్లో జరిగే రెండో వన్డేలో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో అక్షర్ పటేల్ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ను గెలిపించాడు. బ్యాటింగ్లో అజేయంగా 57 పరుగులు, బౌలింగ్లో 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ 75 బంతుల్లో 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగినా, తన క్లాస్ను మరోసారి చూపించాడు. వాషింగ్టన్ సుందర్ కూడా అజేయంగా 52 పరుగులు చేసి అక్షర్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
వన్డే సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులో చేరినా.. తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయినప్పటికీ వారి అనుభవం జట్టుకు కాస్త ధైర్యాన్ని అందించిందని గట్టిగా చెప్పవచ్చు. అలాగే భారత పేసర్లు గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ తొలి వన్డేలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త బంతితో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇంగ్లాండ్ విషయానికి వస్తే.. తొలి వన్డేలో జాకబ్ బెథెల్, బెన్ డకెట్ మంచి ఆరంభం ఇచ్చినా, దాన్ని భారీ స్కోర్గా మార్చలేకపోయారు. గర్నూర్ బ్రార్ వేసిన ఓవర్లో ఇద్దరూ ఔటవడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. మరోవైపు గాయం కారణంగా జేమీ ఓవర్టన్ దూరం కావడం ఇంగ్లాండ్కు ఎదురుదెబ్బగా మారింది. అతని స్థానంలో గస్ అట్కిన్సన్ లేదా సామ్ కరన్కు అవకాశం లభించే అవకాశం ఉంది.
కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో పేసర్లకు స్వింగ్, బౌన్స్ లభించే అవకాశం ఉంది. మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ బ్యాటింగ్ సులభమవుతుంది. స్పిన్నర్లకు కూడా కొంత టర్న్ లభించే అవకాశముంది. జూలై 16న కార్డిఫ్లో ఎండతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఇప్పటివరకు భారత్, ఇంగ్లాండ్ జట్లు మొత్తం 112 వన్డేల్లో తలపడ్డాయి. అందులో భారత్ 63 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ 44 మ్యాచ్ల్లో గెలిచింది. రెండు మ్యాచ్లు టై కాగా, మూడు మ్యాచ్లు ఫలితం తేలలేదు. ఈ గణాంకాలు భారత్కే స్వల్ప ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి. నేడు మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది.
ప్లేయింగ్ XI (అంచనా):
భారత్ ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI:
జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, లియామ్ డాసన్, గస్ అట్కిన్సన్/సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.

