తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కబ్జాదారుల నుంచి వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని రక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, బఫర్ జోన్ లోని స్థలాలను కబ్జాదారుల చెరనుంచి కాపాడుతోంది. ఈ క్రమంలో పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో అక్రమ ప్రహారీలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నం.28లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే 2 ఎకరాల్లో నివాసాల నిర్మాణం.. నివాసాల జోలికి వెళ్లని హైడ్రా.. మిగిలిన 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు తెలిపారు. చెరువును మట్టితో పూడ్చి అక్రమ ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో కబ్జాదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కోర్టు కోటి రూపాయల ఫైన్ విధించినా కబ్జాదారులు మారలేదు. ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నాన్ని హైడ్రా అడ్డుకున్నది. సున్నితమైన ప్రాంతంలో వివాదాలకు చెక్ పెట్టింది. హైడ్రా చర్యలతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు.. కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నాలా, కుంట పునరుద్ధరిస్తే వరద ముప్పు తగ్గుతుందని సూచించారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
