Hyderabad Police: సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలనే మోజులో కొందరు చేస్తున్న అసభ్యకరమైన పనులు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. వ్యూస్ కోసం విలువలనే విస్మరిస్తారా? అని ప్రశ్నించారు. ఇక మీద మితి మీరితే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. “ముఖ్యంగా చిన్నారులు, యువత మనసులపై ఇవి విషం చిమ్ముతున్నాయి. డబ్బు, స్పాన్సర్షిప్ల కోసం ‘Thirst Trap’ వంటి పద్ధతులతో సంస్కృతిని కలుషితం చేయడం దుర్మార్గం. గుర్తుంచుకోండి.. ‘రీల్’ ప్రపంచంలో వచ్చే చప్పట్ల కోసం ‘రియల్’ లైఫ్ గౌరవాన్ని కోల్పోకండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, షేర్ ఒక మద్దతు లాంటిది. ఇలాంటి కంటెంట్ను ప్రోత్సహించడం అంటే అసాంఘికతను పెంచి పోషించడమే. అసభ్యకర కంటెంట్ను పోస్ట్ చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని మర్చిపోవద్దు. బాధ్యత గల పౌరులుగా సోషల్ మీడియాను ఒక విజ్ఞాన వేదికగా మార్చండి.” అని హెచ్చరించారు.
READ MORE: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా రోజు రోజుకూ దారుణంగా మారుతోంది. కొందరు మంచి పనుల కోసం వాడుకుంటే ఎక్కువ శాతం పిచ్చి పనులు, విచిత్ర, అసభ్య కంటెంట్ కోసం వాడుతున్నారు. మరికొందరు మాత్రం రెచ్చిపోయి అసభ్యకర కంటెంట్ చేస్తున్నారు. ఇదంతా లైక్స్, ఫాలోవర్స్ కోసమే. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం మానుకోవాలి. అంతేకాదు.. రీల్స్ (Reels) కోసం ప్రాణాలను పణంగా పెట్టడం లేదా ప్రమాదకరమైన పనులు చేయడం పిచ్చితనం, ఇది ప్రాణాలకే ముప్పు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకరమైన ప్రదేశాలలో వీడియోలు తీయడం, అపాయకరమైన స్టంట్స్ చేయడం వంటివి అస్సలు చేయకూడదు. సురక్షితంగా, క్రియేటివ్గా వీడియోలు రూపొందించి ప్రజాదరణ పొందడం ఉత్తమం.