NTV Telugu Site icon

CM Revanth Reddy: ప్ర‌జావ‌స‌రాలకు అనుగుణంగా లింక్ రోడ్లు….

Revanth Reddy

Revanth Reddy

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జావస‌రాల‌కు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ‌ధాని న‌గ‌రంతో పాటు హెచ్ఎండీఏ ప‌రిధిలో హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (హెచ్ఆర్‌డీసీఎల్‌) ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు. వివిధ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెంచ‌డం, ప్ర‌జ‌లు ఎటువంటి అవాంత‌రాలు లేకుండా రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర‌హ‌దారుల నిర్మాణం ఉండాల‌ని సీఎం ఆదేశించారు. ఈ క్ర‌మంలో విశాల ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని సీఎం అన్నారు. అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, ప్ర‌స్తుతం ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ విష‌యంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు.

ఆయా ర‌హ‌దారుల నిర్మాణంతో ప్ర‌యాణికుల ఇబ్బందులు తొల‌గిపోవ‌డంతో పాటు వారికి స‌మ‌యం క‌లిసి వ‌చ్చేలా ఉండాల‌ని, ఈ క్ర‌మంలో అద‌న‌పు భూసేక‌ర‌ణ‌కు కొంత అధిక వ్య‌య‌మైనా వెనుకాడ‌వ‌ద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శులు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణ‌భివృద్ధి శాఖ ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి దాన‌కిశోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది