Hyderabad: తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనలో మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేలులో నిర్మిస్తున్న అత్యాధునిక నూతన హైకోర్టు సముదాయంలో రెండవ దశ (జోన్-II) భవన నిర్మాణ పనులకు ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్.వి. భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పి.ఎస్. నరసింహ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచారు.
తొలి దశలో భాగంగా హైకోర్టు ప్రధాన భవన నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు రెండో దశలో భాగంగా న్యాయమూర్తుల కోసం నిర్మించనున్న క్వార్టర్ల పనులను ప్రారంభించారు. శంకుస్థాపన అనంతరం నూతన హైకోర్టు భవన నమూనా (Model) ప్రదర్శనను జస్టిస్ సూర్యకాంత్, ఇతర అతిథులు ఆసక్తిగా తిలకించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికత, సకల సౌకర్యాలతో ఈ సముదాయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ప్రస్తుత హైకోర్టు భవనంపై ఒత్తిడిని తగ్గించేందుకు, రాజేంద్రనగర్ ప్రాంతంలో విశాలమైన స్థలంలో ఈ కొత్త క్యాంపస్ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ నూతన సముదాయం అందుబాటులోకి వస్తే న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు మెరుగైన వసతులు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు.